తొలిసారిగా రిజర్వేషన్లు
వికలాంగులు, మాజీ సైనికోద్యోగులకు కూడా..
సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకున్నది. సుప్రీంకోర్టులోని సిబ్బంది నియామకాల్లో తొలిసారిగా ఇతర వెనుకబడిన తరగతి(ఓబీసీ) కోటాను తీసుకొచ్చింది. దీంతో ఓబీసీలకు రిజర్వేషన్లు అందనున్నాయి. సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పలు రాజకీయపార్టీలు, ఓబీసీ వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. సిబ్బంది నియామకాలు, ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు కోటాను అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే నిర్ణయించిన విషయం విదితమే. ఇప్పుడు వీరితో పాటు ఓబీసీలకు కూడా నియామకాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ రిజర్వేషన్ పాలసీని విస్తరించటం గమనార్హం. కొత్త పాలసీ ప్రకారం వికలాంగులు, ఎక్స్-సర్వీస్మెన్, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబీకులకు కూడా రిజర్వేషన్లు వర్తించనున్నాయి. ఈ రిజర్వేషన్ అమలు కోసం ఈనెల 4న ఒక నోటిఫికేషన్ విడుదలైంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 146, క్లాజ్ (2) కింద కల్పించిన అధికారాన్ని ఉపయోగించుకొని ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ).. సుప్రీంకోర్ట్ ఆఫీసర్స్ అండ్ సర్వెంట్స్ (కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ కండక్ట్) రూల్స్, 1961ను సవరించారు. నియామకాలు, ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు ఇప్పటికే రిజర్వేషన్ను నిర్ణయించారు. దీని ప్రకారం ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వికలాంగులు, మాజీ సైనికోద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబీకులు సుప్రీంకోర్టులోని సిబ్బంది నియామకాల్లో రిజర్వేషన్ ఫలాలను పొందనున్నారు. రిజిస్ట్రార్లు, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ లైబ్రేరియన్లు, జూనియర్ కోర్టు అసిస్టెంట్లు, ఛాంబర్ అటెండెంట్లు వంటి వివిధ పదవులకు రిజర్వేషన్ కోటా వర్తిస్తుంది. భారత ప్రభుత్వం కాలక్రమేణా జారీ చేసిన నియమాలు, ఆదేశాలు, నోటిఫికేషన్ల ప్రకారం రిజర్వేషన్లు అమలవుతాయి. అయితే, అవసరమైన విధంగా ఈ పాలసీకి సవరణలు, మార్పులు, మినహాయింపులు చేసే అధికారం సీజేఐకి ఉంటుంది.
సిబ్బంది నియామకాల్లో ఓబీసీ కోటా
- Advertisement -
- Advertisement -