నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులపై ఆదిలాబాద్, నిర్మల్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్ధేశం చేశారు. రిజర్వాయర్లకు సంబంధించిన ఇన్ ఫ్లో అవుట్ ఫ్లోల గురించి ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టంపై నివేదిక తయారు చేయాలని సూచించారు. చెరువులకు, కాల్వలకు గండ్లు పడినట్లైతే వెంటనే వాటిని పూడ్చివేయాలని, రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని చెప్పారు. ఎగువన కురుస్తున్న భారీ వానల నేపథ్యంలో పెన్ గంగా ఉదృతంగా ప్రవహిస్తున్నందున ముంపు ప్రాంతాల దృష్టి పెట్టాలన్నారు. వరద నీరు నిలిచి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదమున్నందున పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు.
త్వరతగతిన సహాయక చర్యలు చేపట్టాలి
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలానే త్వరతగతిన సహాయక చర్యలు చేపట్టాలని, ప్రభావిత మండలాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఆర్ డబ్ల్యుఎస్, హెల్త్ అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలని చెప్పారు. ప్రమాదకరంగా పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. రోడ్ల మీద నీరు పూర్తి స్థాయిలో తగ్గే వరకూ ప్రజలు బయటకు రాకూడదని, సహాయక చర్యల్లో ప్రజలు అధికారులకు సహకరించాలని మంత్రి కోరారు.