ఇంజిన్లో సాంకేతిక సమస్యతో బీఎండబ్ల్యూ నిర్ణయం
బెర్లిన్: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ప్రపంచవ్యాప్తంగా లక్షల కార్లను రీకాల్ చేసింది. ఇంజిన్ స్టార్టర్లలో నెలకొన్న సాంకేతిక సమస్యతో నిప్పు రాజుకొనే ప్రమాదం ఉండటంతో ఈ రీకాల్ చేస్తున్నట్టు ఆ సంస్థ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. 2020-2022 మధ్య ఉత్పత్తి చేసిన 16 మోడళ్లలో ఈ సమస్య ఉన్నట్టు ప్రతినిధి తెలిపారు. వివిధ మోడల్స్కు చెందిన దాదాపు 5,75,000 వాహనాల పై ఈ ప్రభావం ఉంటుందని అంచనా. ఈ మోడల్ వాహనాల్లో స్టార్టర్ మోటార్ వ్యవస్థలో సాంకేతిక లోపాలు ఉన్నాయని ఉత్పత్తి తనిఖీలు, కస్టమర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల ద్వారా వెల్లడైందని బీఎండబ్ల్యూ పేర్కొంది. ఎక్కువసార్లు స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తే అందులోని మాగెటిక్ స్విచ్లు అరిగిపోవడంతో.. కారు స్టార్ట్ అవడం కూడా కష్టతరం అవుతుందని వెల్లడించింది. కొన్ని సందర్భాల్లో ఇది వాహనంలో మంటలు చెలరేగడానికి దారితీయొచ్చని పేర్కొంది.



