కాంగ్రెస్పార్టీ అగ్రనేత రాహుల్
న్యూఢిల్లీ : హోలీ పండుగ సందర్భంగా హిందువులు- ముస్లింల మధ్య జరిగిన ఘర్షణల్లో తరుణ్ బుటోలియా అనే యువకుడు మృతి చెందారు. ఈ ఘటన మార్చి 4న జరిగింది. హోలీ పండుగ సందర్భంగా నీటితో నింపిన బెలూన్ని తరుణ్ మేనకోడలు విసరడంతో అక్కడ గొడవ జరిగింది. హిందూ- ముస్లింల మధ్య జరిగిన ఈ ఘర్షణల్లో తరుణ్ మృతి చెందారు. ఈ ఘటనపై లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్గాంధీ గురువారం స్పందించారు. బీజేపీ మాత్రమే రక్తపాతాన్ని కోరుకుంటోందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ నగర్ ఘటనపై బీజేపీ మత హింసను రెచ్చగొడుతుందని, ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు లొంగపోవద్దని ఢిల్లీవాసులకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు రాహుల్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. ముఖ్యంగా ఈ హింసకు ఉత్తమ్నగర్ ప్రజలు భారీ మూల్యం చెల్లించారు. ఈ హింస వల్ల తరుణ్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఇప్పుడు వారి కుటుంబం మొత్తం వేధింపులను ఎదుర్కొంటోంది. వారు రక్తపాతాన్ని కోరుకోవడం లేదు. కానీ బీజేపీ మాత్రమే రక్తపాతాన్ని కోరుకునేది. ద్వేషమనే పెనం మీద హింస అనే రొట్టెను కాల్చడానికి గల ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకునే నైజం బిజెపిది. దాని సహజ లక్షణమే అది అని రాహుల్ ఎక్స్ పోస్టులో బీజేపీ పై తీవ్ర విమర్శలు చేశారు. వారు (బీజేపీ నేతలు) హిందూ – ముస్లిం గొడవల్లోనే దేశం చిక్కుకొని ఉండాలని కోరుకుంటున్నారు. దేశ రక్షణ, ఇంధన భద్రత, ఆహార భద్రత, వ్యూహాత్మక సార్వభౌమాధికారాన్ని అమెరికాకు అప్పగించమని ప్రధానమంత్రిని ఎందుకు బలవంతం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకే.. దేశ రాజధానిలో పట్టపగలు అల్లర్లను సృష్టిస్తున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ పాల్పడే రెచ్చగొట్టే చర్యలకు లొంగిపోవద్దని, ఐక్యత సోదరభావం, ప్రేమను వ్యాప్తి చేయాలని, కలిసికట్టుగా ఉండాలని రాహుల్ ఢిల్లీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.



