Friday, June 13, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఆపరేషన్‌ కగార్‌ను నిలిపేయాలి

ఆపరేషన్‌ కగార్‌ను నిలిపేయాలి

- Advertisement -

మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి
ఖనిజ సంపదను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టొద్దు
శాంతి చర్చల కమిటీ, వామపక్షాల డిమాండ్‌
17న హైదరాబాద్‌లో మహాధర్నా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఆపరేషన్‌ కగార్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తక్షణమే నిలిపేయాలని శాంతి చర్చల కమిటీ, వామపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. కాల్పుల విరమణను ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరాయి. అడవుల్లోని ఖనిజ సంపదను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టొద్దని తెలిపాయి. మావోయిస్టులను అంతం చేయడమే లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఈనెల 17న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్టు ప్రకటించాయి. దీన్ని జయప్రదం చేయాలని కోరాయి. బుధవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో శాంతి చర్చల కమిటీ ప్రతినిధులు, వామపక్ష పార్టీల నేతలు పాల్గొని మాట్లాడారు.
మావోయిస్టులను కాదు… పేదరికాన్ని నిర్మూలించాలి : తమ్మినేని
దేశంలో 2026, మార్చి నాటికి మావోయిస్టులను అంతం చేస్తామంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించారని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. మావోయిస్టులను కాదనీ, దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం కోసం డెడ్‌లైన్లు విధించాలని సూచించారు. ధరలను తగ్గించాలనీ, నిరుద్యోగాన్ని నిర్మూలించాలనీ, ఉపాధి అవకాశాలను పెంచాలనీ, పేద, ధనిక తేడాలను తగ్గించాలని కోరారు. పేదరికాన్ని తొలగిస్తే దేశంలో వామపక్ష ఉగ్రవాదం ఉండబోదని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ పని చేయకుండా పేదరికం పోవాలంటూ పోరాడుతున్న వ్యక్తులు, సంస్థలను అణచివేస్తున్నదని విమర్శించారు. మావోయిస్టుల సమస్యను శాంతి భద్రతల సమస్యగా చూడొద్దనీ, రాజకీయ, ఆర్థిక కోణంలో చూసి పరిష్కరించాలని సూచించారు.
కానీ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఈ సమస్యను సిద్ధాంత సమస్యగా చూస్తున్నాయని వివరించారు. దేశంలో ఎవరిని నిర్మూలించాలో ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతంలోనే ఉందనీ, ముస్లింలు, క్రిస్టియన్లు, కమ్యూనిస్టులను లేకుండా చేయాలంటూ గోల్వాల్కర్‌ చెప్పారని గుర్తు చేశారు. పహల్గాం ఉగ్ర దాడిలో ప్రజలను మతాన్ని అడిగి చంపారనీ, దాని వల్ల మత విద్వేషాలు పెరిగాయని అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ తప్పుడు సిద్ధాంతాన్ని భారత సమాజం గుర్తించకుంటే భవిష్యత్తు అంధకారం అవు తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 17న ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు.
బిన్‌లాడెన్‌ తరహాలోనే నంబాల కేశవరావు హత్య : అనిల్‌కుమార్‌
బిన్‌లాడెన్‌ను అమెరికా చంపినట్టుగానే నంబాల కేశవరావును భారత ప్రభుత్వం హత్య చేసిందని కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌కుమార్‌ చెప్పారు. ఆయన దేశాన్ని విచ్ఛిన్నం చేశారా?, విడగొట్టడానికి పనిచేశారా?, దేశానికి వ్యతిరేకంగా పోరాటం చేశారా? అని ప్రశ్నించారు. ఆయన లష్కర్‌ ఏ తోయిబా ఉగ్రవాదా?, ఐఎస్‌ఐఎస్‌ తీవ్రవాదా?, అంత క్రూరంగా చంపడమేంటని అడిగారు. వారి శవాలను కుటుంబాలకు ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు. పేదలు, ఆదివాసీల హక్కుల కోసం పోరాడారనీ, జీవితాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ హింసను ప్రేరేపించబోదని అన్నారు. మావోయిస్టులతో శాంతి చర్చలు వెంటనే జరపాలని డిమాండ్‌ చేశారు. ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే ఆపాలని కోరారు. కాంగ్రెస్‌ సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నా దేశ చరిత్రలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. కాంగ్రెస్‌ది గాంధేయవాదమని చెప్పారు. వైఎస్‌ హయాంలో మావోయిస్టులతో చర్చలు జరిపామని అన్నారు. హింసకు తావులేదనీ, కాల్పుల విరమణను ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
మావోయిస్టులను అంతం చేస్తామనడం ప్రజాస్వామ్యమా? : పశ్యపద్మ
దేశంలో 2026, మార్చి నాటికి మావోయిస్టులను లేకుండా చేస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించడం ప్రజాస్వామ్యమా?అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్య పద్మ ప్రశ్నించారు. ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే ఆపాలని డిమాండ్‌ చేశారు. అటవీ సంపద, వనరులతోపాటు ఆదివాసీలను కాపాడాలని చెప్పారు. శాంతి చర్చలు జరపాలని కోరినా కేంద్రం కాల్పులు జరపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
ఇది బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ బరితెగింపు చర్య అని విమర్శించారు. దీనికి కారకులు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా అని చెప్పారు. సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం హన్మేష్‌, ఆరెస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, సీపీఐ(ఎంఎల్‌) రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న, ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి సిహెచ్‌ మురహరి మాట్లాడుతూ మావోయిస్టులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యుద్ధం చేస్తున్నదని విమర్శించారు. జంతువులను వేటాడినట్టు మనుషులను వేటాడి చంపుతున్నదని అన్నారు.
శవాలను కూడా వారి కుటుంబ సభ్యులు, బంధువులకు ఇవ్వకపోవడమేనా హిందూ ధర్మమని ప్రశ్నించారు. కాల్పులను విరమించి మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. శాంతి చర్చల కమిటీ ప్రతినిధులు హరగోపాల్‌, జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ చర్చలకు వస్తామన్నా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌ పేరుతో కాల్పులు జరపడం నేరమని చెప్పారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు చర్చల కోసం పాకిస్తాన్‌తో ఒప్పందం చేసుకున్నారని గుర్తు చేశారు. ఈ దేశ పౌరులైన మావోయిస్టులతో చర్చలెందుకు జరపరని ప్రశ్నించారు. ఏ సమస్యకు అయినా చర్చలతోనే పరిష్కారం లభిస్తుందన్నారు. చర్చలు జరపకపోవడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతం అడ్డమా?, కార్పొరేట్ల ప్రయోజనాలు అడ్డమా?అని సూటిగా అడిగారు. మావోయిస్టులు ఎవరైనా లొంగిపోవచ్చన్న ప్రకటనను ఇస్తే బాగుంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు కె గోవర్ధన్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు చెరుకు సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -