దేశం మీద ప్రేమ కలిగి ఉండటం ఒక వంతు అయితే ఆ ప్రేమను ప్రజలందరికీ ఉప యోగపడేలా ఏదో ఒక రూపంలో బయట పెట్టడం సామాన్య విషయం కాదు. ఇటీవల కాలంలో మన దేశ పౌరులపై జరిగిన దాడికి దీటుగా మన దేశ జవాన్లు పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంపులపై చేసిన ‘ఆపరేషన్ సిందూర్’ను స్ఫూర్తిగా తీసుకుంటూ ప్రముఖ హెల్త్ డైట్ లక్ష్మణ్ పూడి ఓ పాట రూపంలో తన దేశభక్తిని చూపారు. ప్రసాద్ రచించిన ఈ పాటకు రమేష్ సంగీతాన్ని అందించగా, కష్ణ సినిమాటోగ్రాఫర్గా చేశారు. ఉమా శంకర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటకు మనికంట ఎడిటింగ్ చేయగా, సత్య శ్రీనివాస్ సంగీత సహకారాన్ని అందించారు. లక్ష్మణ్ పూడి ఈ పాటకు స్వరాన్ని జోడించి స్వీయ దర్శకత్వంలో నటిస్తూ ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ పాట ఆవిష్కరణలో జేడీ లక్ష్మీనారాయణ, అలీ, మేజర్ ఒబెరారు, జేఏసీ చైర్మన్ అంజిబాబు, నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ పూడి మాట్లాడుతూ, ‘ ‘నేను డాక్టర్ని మాత్రమే కాదు. నాలో ఒక విప్లవ కళాకారుడు, గాయకుడు, రచయిత ఉన్నాడు. మిలటరీ మాధవపురం అనే ఊరుకు ప్రతి ఏటా వెళ్లి పాటలు పాడేవాళ్ళం. వాళ్లే మాకు స్ఫూర్తి. దేశం కోసం ఏమైనా చేయాలి అని, అందరికీ ఒక స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతో ఈ పాటను చేశాను. ఈ పాటను జవాన్ మురళీనాయక్ కుటుంబానికి అంకితం చేస్తున్నాను’ అని తెలిపారు.