పాట్నా పెన్షన్ సంఘర్ష్ సభలో ఎన్ఎంఓపీఎస్ సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ
నవతెలంగాణ – హైదరాబాద్
పాత పెన్షన్ అమలు చేస్తే రాజకీయ పార్టీలకే తమ ఓట్లు వేస్తామని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్ఎంఓపీఎస్) సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ చెప్పారు. ఆదివారం పాట్నా పెన్షన్ సంఘర్ష్ బహిరంగ సభను ఎన్ఎంఓపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఓట్ ఫర్ ఓపీఎస్ అని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ రాష్ట్ర పరిధిలోనిదని అన్నారు. ఇటీవల దేశంలో పార్టీలు తమ మ్యానిఫెస్టోలో సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేస్తామంటూ తెలంగాణ, కర్నాటకలో సీపీఎస్ ఉద్యోగుల మద్దతుతో అధికారంలోకి వచ్చాయని వివరించారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో బీహార్లో కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరిస్తామంటూ హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీహార్లో ఆ పార్టీలకే సీపీఎస్ ఉద్యోగుల మద్దతు ఉంటుందన్నారు. ఉద్యోగి కాంట్రిబ్యూషన్తో సంబంధం లేకుండా ఓపీఎస్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ఎన్పీఎస్ ట్రస్టు ద్వారా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన రూ.10.53 లక్షల కోట్లకు మరింతగా కాంట్రిబ్యూషన్ను పెంచి ప్రయివేటు పెట్టుబడిదారులకు అప్పజెప్పడమే అవుతుందని చెప్పారు. ఎన్పీఎస్పై నిరసనలు వెల్లువెత్తడంతో కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు మార్చుకోవచ్చంటూ కేంద్రం అంటూనే ఎన్పీఎస్లో జమ అయిన మొత్తాలను ఓపీఎస్ను పునరుద్ధరించిన రాష్ట్రాలకు స్పష్టం చేయడం సరైంది కాదన్నారు. రాష్ట్ర ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వాల స్వేచ్ఛను హరించడమే అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంఓపీఎస్ ప్రతినిధులు విజరుబంధు, జార్ఖండ్ అధ్యక్షులు విక్రాంత్, తెలంగాణ సీపీఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కారకట్ నియోజకవర్గ సీపీఐ ఎంపీ పి రాజారాం సింగ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి ప్రదీప్ ఠాగూర్, భరత్శర్మ, బీహార్ అధ్యక్షులు వరుణ్పాండే, శశిభూషణ్ తదితరులు పాల్గొన్నారు.