బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య
ధర్నాచౌక్ వద్ద ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా
నవతెలంగాణ-ముషీరాబాద్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సి.రాజేందర్ అధ్యక్షతన శనివారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో లక్షలాది మంది ఉద్యోగులు 20-25 సంవత్సరాల నుంచి పని చేస్తున్నా ఉద్యోగ భద్రత, సరైన వేతనాలు లేవన్నారు. వారిని పర్మినెంట్ చేయడం లేదన్నారు. పైగా నెల నెలా సక్రమంగా వేతనాలు చెల్లించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఐకార్ పరిశోధన సంస్థలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను రూ.10 వేల నుంచి రూ.25 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. వీరు 20-25 ఏండ్ల నుంచి పనిచేస్తున్నారని, దశల వారీగా రెగ్యులరైజ్ చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో 2 లక్షలా 50 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఏండ్ల తరబడి పని చేస్తున్నా తక్కువ వేతనాలు ఉన్నాయనీ, అవి కూడా సక్రమంగా చెల్లించడం లేదని అన్నారు. వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని చెప్పినా.. అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 240 రోజులు రెగ్యులర్గా పనిచేసిన వారిని పర్మినెంట్ చేయాలని రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులు చెప్పిందని గుర్తు చేశారు. కానీ, తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. పక్క రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడు, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాలు కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేశాయని చెప్పారు. ఈ ధర్నాలో బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు అనంతయ్య, విద్యార్థి సంఘం కన్వీనర్ మోదీ రాందేవ్, బాలస్వామి, రాజు నేత పాల్గొన్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES