– జూన్ 17న ఇందిరాపార్కు వద్ద సామూహిక దీక్షలు : టీజీఎస్ఆర్టీసీ ఎస్డబ్ల్యూయూ ప్రకటన
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలను నిలుపుదల చేయాలని టీజీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఎస్డబ్ల్యూయూ) డిమాండ్ చేసింది. దీనితోపాటు కార్మికుల పెండింగ్ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ జూన్ 17వ తేదీ హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద సామూహిక నిరాహారదీక్షలు చేపడుతున్నామని ఆ సంఘం రిప్రజెంటేషన్ కమిటీ సమావేశంలో నిర్ణయం చేసినట్టు తెలిపారు. ఈ కమిటీ సమావేశం బుధవారం నారాయణగూడలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఎస్డబ్ల్యూయూ వైస్ చైర్మెన్ జీ అబ్రహాం అధ్యక్షతన జరిగింది. ప్రధాన కార్యదర్శి కే రాజిరెడ్డి, అడిషనల్ ప్రధాన కార్యదర్శులు డీ గోపాల్, ఎస్ సాయిరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. కార్మిక సంఘాలపై ఆంక్షలు ఎత్తేయాలనీ, వెల్ఫేర్ కమిటీలు రద్దు చేయాలనీ, ఆర్టీసీ అపాయింటెడ్ డేట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇటీవల రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కార్మిక సంఘాలు చర్చించిన అంశాలను అమల్లోకి తేవాలన్నారు. యాజమాన్య నిర్ణయాలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నాయనీ, ఆయా నిర్ణయాలను సమీక్షించాలని కోరారు. జూన్ 17న జరిగే సామూహిక దీక్షల్లో అన్ని డిపోల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ నియామకాలు ఆపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES