రోధిస్తున్న గొర్రెల కాపరులు…
సుమారు రూ.20 లక్షల నష్టం
లబోదిబోమంటున్న బాధితులు
నవతెలంగాణ – వేములపల్లి
విషాహారం తిని 100కు పైగా గొర్రెలు మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో సమీపంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా, పెన్పహాడ్ మండలం, అన్నారం, అనంతరం, దోసపాడు గ్రామాలకు చెందిన గొర్రెల కాపరులు గత కొన్ని రోజులుగా మండల కేంద్రం సమీపంలో గొర్రెలు మేపుతున్నారు. కాగా బుధవారం రాత్రి 80 గొర్రెలు, గురువారం 40 గొర్రెలకు పైగా విషాహారం తిని మృతి చెందినట్లు వారు తెలిపారు. సుమారు రూ.20 లక్షల పైగా నష్టం వాటిల్లినట్టు గొర్రెల కాపరులు వాపోయారు. భారీ సంఖ్యలో గొర్రెలు చనిపోవడంతో గొర్రెల కాపరులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం స్పందించి మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకుంటున్నారు.




