– వందకుపైగా మరణాలు
– రేవంత్ సర్కార్ది అమానవీయ పాలన : కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గురుకుల విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు, విద్యార్థుల మరణాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఏడాది కాలంలో గురుకులాల్లో వెయ్యికిపైగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగినట్టు నివేదిక వచ్చిందని తెలిపారు. వేల మంది విద్యార్థులు కల్తీ ఆహారంతో ఫుడ్ పాయిజన్కు గురయ్యారనీ, వంద మందికి పైగా చనిపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అయిన రేవంత్రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఈ సంఘటనలు జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం రేవంత్ నియంతత్వ అమానవీయ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇంతమంది విద్యార్థులు అనారోగ్యం పాలైనా, ఆత్మహత్యలు చేసుకున్నా, మరణిస్తున్నా రేవంత్రెడ్డి పట్టించుకోకపోవడం నేరపూరిత నిర్లక్ష్యమని దుయ్యబట్టారు. గురుకుల విద్యాసంస్థల్లోని ఫుడ్ పాయిజనింగ్, మరణాల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి అనేకసార్లు తీసుకొచ్చినట్టు గుర్తుచేశారు. ప్రతీసారి రాష్ట్ర మంత్రులు కంటి తుడుపు చర్యలతో పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆక్షేపించారు. ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం ఈ విషయం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటి అమానవీయ సంఘటనలపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం ఒక్క సమీక్ష చేయడానికి కూడా సమయం కేటాయించలేదని దుయ్యబట్టారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఆహారం బదులు విషం పెడితే ముఖ్యమంత్రి ఊరుకుంటాడా? ఇదే పరిస్థితి సీఎం పిల్లలకు జరిగినా పరిస్థితిని ఇలానే వదిలేస్తారా? అని ప్రశ్నించారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా బాధ్యత ఎవరిదని, ముఖ్యమంత్రి గతంలో అన్నట్టే ఇప్పుడు ఎవరు బాధ్యులు ఎవరిని ఉరితీయాలో చెప్పాలని డిమాండ్ చేశారు.
గురుకులాల్లో వెయ్యికిపైగా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES