కేంద్రంలో ఉన్న పార్టీదీ అదే విధానం
శ్రీనగర్లో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పహల్గాం దాడి లక్ష్యం మతపరమైన విభజనతో జరిగిందనీ, కేంద్రంలో ఉన్న పార్టీది కూడా అదే విధానమని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ విమర్శించారు. పహల్గాం ఉగ్రవాద దాడి తరువాత జరిగిన పరిణామాలను, ఆ తరువాత జరిగిన ఇండో-పాక్ సరిహద్దు సంఘర్షణను సందర్శించడానికి కాశ్మీర్ చేరుకున్న సీపీఐ(ఎం) ప్రతినిధి బృందానికి శ్రీనగర్లో ఘన స్వాగతం లభించింది. ‘రాజ్యాంగ హక్కుల పునరుద్ధరణ’ అనే అంశంపై బుధవారం సీపీఐ(ఎం) జమ్మూ కాశ్మీర్ కమిటీ నిర్వహించిన సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ప్రతినిధి బృందానికి వందలాది మంది పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. ఉగ్రవాద వ్యతిరేక భావనతో పాటు, కాశ్మీర్ ప్రత్యేక హౌదా, రాష్ట్ర హౌదాను రద్దు చేసినందుకు కేంద్ర ప్రభుత్వ తీరును ఈ సమావేశం వ్యతిరేకించింది. సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం రెండు సందేశాలను ముందుకు తెస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ బేబీ అన్నారు. ”ఈ బృందం లౌకికవాదానికి ఒక ఉదాహరణ. కె. రాధాకృష్ణన్, అమ్రారామ్, బికాశ్ భట్టాచార్య, ఎ.ఎ. రహీమ్, జాన్ బ్రిట్టాస్, మరియన్ అలెగ్జాండర్, బేబీ ఈ బృందంలో ఉన్నారు. అదే విధంగా దక్షిణాన కేరళ, తూర్పున బెంగాల్, పశ్చిమాన రాజస్థాన్ ప్రతినిధులు ఉన్నారు” అని ఆయన అన్నారు. ”పహల్గాం దాడి లక్ష్యం మతపరమైన విభజన. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కూడా అదే విధానాన్ని కలిగి ఉంది. కానీ కాశ్మీర్ ప్రజలు, భారతీయులందరూ ఇచ్చిన సందేశం ఐక్యత” అని స్పష్టం చేశారు. కాశ్మీర్కు ప్రత్యేక హౌదా, రాష్ట్ర హౌదాను పునరుద్ధరించడానికి కేంద్రం సిద్ధంగా ఉండాలని బేబీ చెప్పారు. జమ్మూ కాశ్మీర్ పూర్తి ప్రజాస్వామ్య హక్కులను పునరుద్ధరించాలని కేంద్ర కమిటీ సభ్యుడు ముహమ్మద్ యూసుఫ్ తరిగామి అన్నారు. ”ప్రస్తుతం కేంద్రం పాలనలో ఉంది. స్థానిక ప్రభుత్వానికి అధికారం లేదు. కాశ్మీరీలు అడుక్కోరు. వారు తమకు అర్హత ఉన్నదాన్ని మాత్రమే డిమాండ్ చేస్తారు” అని ఆయన అన్నారు. కాశ్మీరీ ప్రజలు సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం పట్ల చూపిన ప్రేమను కృతజ్ఞతగా అంగీకరించినట్టు లోక్సభ నాయకుడు కె. రాధా కృష్ణన్ తెలిపారు. ”పహల్గాం ఘటన తరువాత కాశ్మీర్ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. పర్యాటకుల సంఖ్య తగ్గడం ప్రజల జీవితాలను ప్రభావితం చేసింది. సరిహద్దులో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయమైన పరిహారం లేదు. వామపక్షాలు పార్లమెంటులో ఈ సమస్యలన్నింటినీ లేవనెత్తుతాయి” అని రాధాకృష్ణన్ అన్నారు. ఎంపీలు అమ్రా రామ్, బికాష్ రంజన్ భట్టాచార్య కూడా మాట్లాడారు.
పహల్గాం దాడి లక్ష్యం మతపరమైన విభజన
- Advertisement -
- Advertisement -