400 మంది మృతి
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్లో భారీ విషాదం చోటుచేసుకుంది. మాదకద్రవ్యాలకు బానిసలైనవారికి చికిత్స అందిస్తున్న ఓ పెద్ద ఆస్పత్రిపై జరిగిన వైమానిక దాడిలో భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటికే 400కు చేరగా, 250 మందికిపైగా గాయపడినట్టు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆఫ్ఘనిస్థాన్లోని ఇస్లామిక్ ఎమిరేట్ డిప్యూటీ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రత్ తెలిపిన వివరాల ప్రకారం.. కాబూల్లో ఉన్న 2 వేల పడకల సామర్థ్యం గల ఒమిద్ అడిక్షన్ ట్రీట్మెంట్ ఆస్పత్రిపై రాత్రి సుమారు 9 గంటల సమయంలో వైమానిక దాడి జరిగినట్టు తెలిపారు. ఈ దాడి వల్ల ఆస్పత్రి భవనం పెద్ద భాగం పూర్తిగా ధ్వంసమైందని పేర్కొన్నారు. ఘటన తర్వాత ఆస్పత్రిలో భారీగా మంటలు చెలరేగడంతో పరిస్థితి మరింత విషమంగా మారింది. దాడి జరిగిన సమయంలో ఆస్పత్రిలో వందల సంఖ్యలో రోగులు చికిత్స పొందుతున్నట్టు అధికారులు తెలిపారు. మాదకద్రవ్యాలకు బానిసలైన వారికి చికిత్స అందించే ప్రత్యేక కేంద్రంగా ఈ ఆస్పత్రి పనిచేస్తోంది. ఒకేసారి పెద్ద సంఖ్యలో రోగులు, వైద్య సిబ్బంది అక్కడ ఉండటం వల్లే ప్రాణనష్టం అధికంగా జరిగిందని ఆఫ్ఘాన్ అధికారులు పేర్కొన్నారు.
దాడి తర్వాత వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రక్షణ బందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆస్పత్రి భవనంలో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. శిథిలాలకింద ఇంకా పలువురు చిక్కుకుపోయి ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.
ఆఫ్ఘాన్లోని ఆస్పత్రిపై పాక్ వైమానిక దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



