కరువు పీడిత ప్రాంతాలపై మోడీ వివక్ష
ప్రాధాన్యతాక్రమంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి : అఖిలభారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్
తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మోటారు పంపుల పరిశీలన
నవ తెలంగాణ -మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
”తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించాలి.. కరువు పీడిత ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని మహబూబ్నగర్ లాంటి జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలి..” అని అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్ డిమాండ్ చేశారు. నాగర్కర్నూల్ జిల్లాలో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన సర్జిపుల్ టన్నెల్ అప్రోచ్ కెనాల్ మోటారు పంపులను శుక్రవారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాలో అతి తక్కువ వర్షాలు పడటం వల్ల కరువుకు నిలయంగా మారిందని, ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి పథకం పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదన్నారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించి పనులు త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాగునీటితో పాటు సాగునీటిని అందిం చేందుకు చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి పనులు మొదలుపెట్టి 15 ఏండ్లు అయినా.. ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నిం చారు. ఈ ఎత్తిపోతల పథకం పూర్తి అయితే ఆరు జిల్లాలకు సాగు, తాగునీరు అందించే అవకాశాలున్నాయన్నారు. ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయకపోతే త్వరలో ఉద్యమం చేపడుతామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దక్షిణ తెలంగాణలో ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులు ఏవి చేపడతారో చెప్పాలని డిమాండ్ చేశారు.
సాగునీరు అందించడం మరింత ఆలస్యం : రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్
ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న అలసత్వం వల్ల సాగునీరు అందించడం మరింత ఆలస్యం అవుతోందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ అన్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రాజెక్టు.. 145 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 9 మోటర్లు ఉన్నాయన్నారు. 35 వేల కోట్ల అంచనాతో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు నేడు 60 వేల కోట్లకు పెరిగిందన్నారు. ఇంకా ఆలస్యమైతే వ్యయం పెరిగి సాగునీరు అందించడం కూడా మరింత ఆలస్యం అవుతుందన్నారు. 2023 సెప్టెంబర్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ ఎన్నికలకు ముందు ఒక మోటార్ ద్వారా నీటిని విడుదల చేసి ఆ తర్వాత వెంటనే నీటిని నిలిపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు ఆరు జిల్లాల్లో వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయన్నారు. రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త అరిబండి ప్రసాద్రావు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రారెడ్డి, జంగారెడ్డి, శోభన్, మధుసూదన్ రెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పర్వతాలు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.శ్రీనివాసులు, కందికొండ గీత, దేశ్యానాయక్, చింత ఆంజనేయులు, పి.ఆంజనేయులు, వనపర్తి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బాల్రెడ్డి, మండల కార్యదర్శి శివవర్మ, నాయకులు ఎం.శ్రీనివాసులు, నరసింహ, దేవేందర్ పాల్గొన్నారు.
పాలమూరు-రంగారెడ్డి కిజాతీయ హోదా కల్పించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES