నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 3,834 సర్పంచి.. 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది. 37,562 పోలింగ్ కేంద్రాల్లో 56,19,430 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి.. ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి.. ఉపసర్పంచి ఎన్నికలు నిర్వహిస్తారు.
తొలి దశలో 4,236 గ్రామపంచాయతీ సర్పంచి పదవులకు.. 37,440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. వీటిలో ఐదు సర్పంచి పదవులకు, 169 వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 396 సర్పంచి పదవులు… 9,633 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఒక గ్రామపంచాయతీ సర్పంచి, 10 వార్డు స్థానాల ఎన్నికలపై న్యాయస్థానాలు స్టే విధించాయి. ఇవి పోనూ గురువారం 3,834 సర్పంచి పదవులకు 12,960 మంది అభ్యర్థులు… 27,628 వార్డు సభ్యుల స్థానాలకు 65,455 మంది పోటీ చేస్తున్నారు. సర్పంచి పదవులకు సగటున 3.38 మంది, వార్డు సభ్యుల స్థానాలకు సగటున 2.36 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.



