30 రోజుల్లో వార్డుల విభజన, రిజర్వేషన్లు పూర్తిచేయాలి
స్థానిక ఎన్నికలపై హైకోర్టు తీర్పు… మాజీ సర్పంచులకు అధికార కొనసాగింపు పిటిషన్ తిరస్కరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ సర్పంచులు, వార్డు మెంబర్ల పదవులకు మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ తీర్పు వెల్లడించింది. ఎన్నికల నిర్వహణకు సెప్టెంబర్ 30 తుదిగడువుగా విధించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మాధవీదేవి బుధవారం తీర్పునిచ్చారు. నల్లగొండ జిల్లా మల్లేపల్లి, కుర్మపల్లి తాజా మాజీ సర్పంచులు పార్వతి, శ్రీనివాస్, జనగాం జిల్లా కాంచనపల్లి తాజా మాజీ సర్పంచ్ విజయ, నిర్మల్ జిల్లా తల్వెడ తాజా మాజీ సర్పంచ్ అనిల్కుమార్, కరీంనగర్ జిల్లా చంగర్ల తాజా మాజీ సర్పంచ్ వేణుగోపాల్, నిజయతీగూడెం తాజా మాజీ సర్పంచ్ మురళీధర్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీరి తరఫు న్యాయవాదులు చేసిన వాదనలను హైకోర్టు ఆమోదించింది. ‘గ్రామ పంచాయతీల పదవీకాలం 2024, జనవరి 31తో ముగిసింది. రాజ్యాంగం ప్రకారం పదవీకాలం ముగిసేలోపే ఎన్నికలు నిర్వహించాలన్న దానిపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాలి. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. గత పాలకవర్గాల పదవీ కాలం పూర్తయి 14 నెలల కంటే ఎక్కువ సమయమే అయింది. ఈ ఆలస్యం సమర్థనీయమా? కాదా? అనే అంశంలోకి వెళ్లడం లేదు. వార్డుల విభజన, సర్పంచుల పదవులు, వాటికి రిజర్వేషన్ల వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం 20 రోజుల గడువు కావాలని కోరింది. తాము 30 రోజుల గడువు ఇస్తున్నాం. ఈ మేరకు అవి పూర్తి చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి వాటి వివరాలు నివేదించాలి. ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం 60 రోజుల్లోగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ సర్పంచులు, వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు పూర్తి చేయాలి. ఎన్నికల నిర్వహణపై ఐదు దశల ప్రక్రియను పూర్తి చేసేందుకు కనీసం 20 రోజులు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీనిని పరిగణనలోకి తీసుకుంటున్నాం. తామిచ్చే తీర్పు ప్రతి అందినప్పటి నుంచి 30 రోజుల గడువు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నాం. ఎన్నికలు నిర్వహించేందుకు తేదీలపైనా రాష్ట్ర ప్రభుత్వం కూడా సమ్మతి చెప్పాలి. ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ప్రక్రియ అంతా సెప్టెంబర్ 30నాటికి పూర్తి చేయాలి’ అని తీర్పు వెల్లడించింది.
విచారణ సమయంలో హైకోర్టు ప్రశ్న
స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ను హైకోర్టు గత విచారణ సమయంలో ప్రశ్నించింది. గత ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదని అడిగింది. గతేడాది డిసెంబర్లో జరిగిన విచారణ సమయంలో ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేయలేదని ఆరా తీసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు సుమారు నెల రోజుల గడువు అవసరమని రాష్ట్రం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ మహ్మద్ ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందనీ, అయితే, సమగ్ర ప్రక్రియ పూర్తి చేసేందుకు కొంత వ్యవధి అవసరమని కోరారు. వార్డు విభజన, రిజర్వేషన్ల వర్గీకరణకు కనీసం 20 రోజుల గడువు కావాలని విన్నవించారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫు సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ స్పందిస్తూ.. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు లభించిన తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రెండు మాసాల సమయం తమకు అవసరమన్నారు. ప్రభుత్వం నుంచి చట్ట ప్రకారం అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తే రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఏర్పాట్లు చేసేందుకు రెండు నెలల సమయం అవసరమని వాదించారు.
పిటిషనర్ల తరఫు లాయర్ భాస్కర్ రెడ్డి వాదిస్తూ.. 2024, జనవరి 31తో సర్పంచుల పదవీ కాలం ముగిసిందనీ, పదవీ కాలం ముగిసి దాదాపు 18 నెలలు అయ్యిందని వాదించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కాలపరిమితి ముగిసిన ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలనే నిబంధనను ప్రభుత్వం ఉల్లంఘించిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సర్పంచుల పదవీ కాలం ముగిసి ఏడాదిన్నర కాలమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం లేదని వాదించారు. తాజా మాజీ సర్పంచ్లను పక్కన పెట్టి గ్రామ పంచాయతీలను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నియమించడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనన్నారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018 నిబంధనలకు తిలోదకాలిచ్చిందని చెప్పారు. పదవీకాలం ముగిసిన ఆరునెలల్లోగా స్థానిక ప్రభుత్వాల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. రాజ్యాంగ అధికరణాల స్ఫూర్తిని నీరుగార్చిందన్నారు.
గత విచారణ సమయంలో కూడా ఎన్నికలు నిర్వహించేందుకు రెండు నెలల గడువు కోరిన ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు గడువు కోరడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. ప్రత్యేక అధికారుల పాలనలో సమస్యలు పేరుకు పోయాయనీ, సమస్యల పరిష్కారంలో తీవ్ర అలసత్వం నెలకొందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పాలకమండళ్లు లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు కోత పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో పనులు చేపట్టేందుకు రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా నిధులను అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు సర్పంచులుగా తమ సొంత డబ్బులు వెచ్చించారని గుర్తుచేశారు. తక్షణమే ఆ నిధుల్ని విడుదల చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఎన్నికలు నిర్వహించేందుకు ఇంకా గడువు కావాలనే యోచనలో ప్రభుత్వముంటే ఎన్నికలు నిర్వహించే వరకు సర్పంచులకు పాలనా బాధ్యతలు అప్పగించేలా మధ్యంతర ఆదేశాలు వెలువరించాలని కోరారు. మాజీ సర్పంచులకు అధికార పగ్గాలు ఇవ్వాలన్న అభ్యర్థనను హైకోర్టు వ్యతిరేకించింది. సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్నీ, రాష్ట్ర ప్రభుత్వాన్నీ ఆదేశిస్తూ తీర్పు వెల్లడించింది.
మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES