15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై ఆమోమయం
నవతెలంగాణ – మల్హర్ రావు
కేంద్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు విడుదల చేయనున్న 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై గ్రామాల్లో అయోమయంగా మారనుంది. కొన్ని గ్రామాల్లో వివాదాలు సైతం ఏర్పడనున్నట్లుగా తెలుస్తోంది. అభివృద్ధిపనులకు సంబంధించిన బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచులు డిమాండ్ చేస్తుండగా, తాము ఖర్చు పెట్టిన బిల్లులకు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు.నిబంధనల ప్రకారం నిధులు ఉపయోగించాలని కొత్త సర్పంచులు సూచిస్తుండడంతో నిధుల వినియోగంపై అయోమయం నెలకొంది.
2024 ఫిబ్రవరిలో సర్పంచుల పదవీకాలం ముగియడంతో అప్పటి నుంచి పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర నిధులు నిలిచిపోయాయి. ఇటీవల పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంతో దాదాపు రెండేళ్ల అనంతరం జిపిలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలై త్వరలో గ్రామపంచాయతీల ఖాతాల్లో జమచేయనున్నట్లుగా తెలుస్తోంది.
నిధుల వినియోగంపై అయోమయం..
కేంద్ర ప్రభుత్వం గ్రామాభివృద్ధి కోసం ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తోంది. జనాభా ప్రాతిపదికన గ్రామంలోని ప్రతీ వ్యక్తికి నెలకు రూ.80 నుంచి రూ.90 చొప్పున మూడు నెలలకోసారి నిధులు మంజూరవుతాయి. 18 నెలలుగా పాలకవర్గాలు లేకపోవడంతో నిధులు విడుదల కాలేదు. మండలంలోని 15 గ్రామపంచాయతీల్లో పెద్ద జిపిలకు రూ.5 నుంచి రూ.10 లక్షలు, చిన్న జిపిలకు రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు నిధులు మంజూరయ్యాయని తెలిసింది.
మంజూరైన నిధులు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవి కావడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన మాజీ సర్పంచులు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే 2023 ఫిబ్రవరి 1 నుంచి పాలకవర్గాలు లేకపోవడంతో అప్పులు చేసి గ్రామా ల్లోని సమస్యలను పరిష్కరించామని తమకే బిల్లులు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శులు విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్న పంచాయతీల్లో రూ.1లక్షల వరకు, పెద్ద పంచాయతీల్లో రూ.3 లక్షల వరకు ఖర్చు పెట్టామని,తమ జీతాలను సైతం వినియోగించామని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు గ్రామాభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలని కొత్త సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. మాజీ సర్పంచుల బిల్లుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.



