పెండింగ్ వేతనాలను విడుదల చేయాలి : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయనున్నట్టు తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ప్రకటించారు. పంచాయతీ కార్మికులందరూ పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లో ఆ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గ్యార పాండు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ..తెలంగాణ ప్రజలకు అతి ముఖ్యమైన దసరా పండుగకు పంచాయతీకార్మికులు పస్తులుండాలా? అని ప్రశ్నించారు.
మూడు నెలల నుంచి వేతనాలు చెల్లించకపోతే ఎలా బతుకుతారని నిలదీశారు. సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హమీ ప్రకారం పంచాయతీ సిబ్బంది వేతనాలకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి గ్రీన్ ఛానల్ ద్వారా కార్మికుల బ్యాంక్ అకౌంట్లలో వేతనాలు జమ చేయాలని డిమాండ్ చేశారు. మల్టీపర్పస్ వర్కర్ పని విధానం వలన ప్రమాదాలు జరిగి మరణిస్తున్న కార్మికుల కుటుంబాలకు రూ.20 లక్షల నష్టపరిహారం ప్రకటించాలనీ, జీఓ నెం.51ని సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు సుధాకర్, రాష్ట్ర మహిళా కన్వీనర్ పొట్టా యాదమ్మ, ఆఫీస్ బేరర్లు పాల్గొన్నారు.