Sunday, June 22, 2025
E-PAPER
Homeఆటలుపంత్‌ ఫటాఫట్‌

పంత్‌ ఫటాఫట్‌

- Advertisement -

– సెంచరీతో చెలరేగిన రిషబ్‌ పంత్‌
– 41 పరుగులకే చివరి ఏడు వికెట్లు కోల్పోయిన భారత్‌
– భారత్‌, ఇంగ్లాండ్‌ తొలి టెస్టు రెండో రోజు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 471/10

రిషబ్‌ పంత్‌ (134) ఫటాఫట్‌ సెంచరీతో కదం తొక్కాడు. తొలి రోజు యశస్వి జైస్వాల్‌ (101), శుభ్‌మన్‌ గిల్‌ (147) శతకాలు సాధించగా రెండో రోజు వైస్‌ కెప్టెన్‌ షో చూపించాడు. టాప్‌-5లో ముగ్గురు బ్యాటర్లు సెంచరీలతో మెరవటంతో లీడ్స్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 471 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓ దశలో 600 ప్లస్‌ స్కోరు సాధించేలా కనిపించిన టీమ్‌ ఇండియా.. చివరి ఏడు వికెట్లను 41 పరుగులకే చేజార్చుంది. ఇంగ్లాండ్‌ పేసర్లు బెన్‌ స్టోక్స్‌, జోశ్‌ టంగ్‌ నాలుగేసి వికెట్లతో భారత్‌ను 471 పరుగులకు కట్టడి చేశారు!.
నవతెలంగాణ-లీడ్స్‌
తొలి టెస్టులో టీమ్‌ ఇండియా యువ బ్యాటర్ల విధ్వంసం కొనసాగింది. యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌ శతక జోరును రిషబ్‌ పంత్‌ (134, 227 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లు) కొనసాగించాడు. తనదైన శైలిలో బౌండరీలు, సిక్సర్లు సంధించిన రిషబ్‌ పంత్‌ లీడ్స్‌ను హోరెత్తించాడు. రిషబ్‌ పంత్‌ టెస్టుల్లో ఏడో సెంచరీతో మెరిసినా.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ ఆశించిన స్కోరు అందుకోలేదు. 430/3తో పటిష్టంగా సాగుతున్న ఇన్నింగ్స్‌ను.. ఇంగ్లాండ్‌ పేసర్లు స్టోక్స్‌, టంగ్‌ కుదిపేశారు. చివరి ఏడు వికెట్లను 41 పరుగుల వ్యవధిలోనే పడగొట్టారు. రెండో రోజు 28 ఓవర్లలో 112 పరుగులు చేసిన భారత్‌ 7 వికెట్లు కోల్పోయింది. 2017 ధర్మశాల (ఆసీస్‌తో) టెస్టు తర్వాత తొలిసారి లీడ్స్‌లో ఆడుతున్న కరుణ్‌ నాయర్‌ (0) డకౌట్‌గా నిష్క్రమించాడు. రవీంద్ర జడేజా (11), శార్దుల్‌ ఠాకూర్‌ (1) నిరాశపరిచారు. ఇంగ్లాండ్‌ బౌలర్లు జోశ్‌ టంగ్‌ (4/96), బెన్‌ స్టోక్స్‌ (4/66) రాణించారు.
పంత్‌ మెరుపుల్‌ :
ఓవర్‌నైట్‌ బ్యాటర్లు శుభ్‌మన్‌ గిల్‌ (147), రిషబ్‌ పంత్‌ (134) తొలి రోజు జోరు కొనసాగించారు. గిల్‌ కాస్త దూకుడు తగ్గించినా.. డ్రింక్స్‌ విరామం వరకు భారత్‌ వికెట్‌ కోల్పోలేదు. ఓవర్‌నైట్‌ స్కోరుకు 20 పరుగులు జోడించిన గిల్‌ స్పిన్నర్‌ బషీర్‌ ఓవర్లో వికెట్‌ కోల్పోయాడు. దీంతో 209 పరుగుల నాల్గో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. రిషబ్‌ పంత్‌ రెండో రోజు మరో 69 పరుగులు జోడించాడు. విలక్షణ షాట్లతో విరుచుకుపడిన పంత్‌ 12 ఫోర్లు, 6 సిక్సర్లతో మెరిశాడు. 10 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 146 బంతుల్లో కెరీర్‌ ఏడో సెంచరీ నమోదు చేశాడు. గిల్‌ నిష్క్రమణ తర్వాత పంత్‌కు మరో ఎండ్‌ నుంచి ఆశించిన సహకారం దక్కలేదు. 2017 తర్వాత తొలిసారి టెస్టుల్లో ఆడుతున్న కరుణ్‌ నాయర్‌ (0) నాలుగు బంతులకే పెవిలియన్‌కు చేరుకున్నాడు. రవీంద్ర జడేజా (11, 15 బంతుల్లో 2 ఫోర్లు), శార్దుల్‌ ఠాకూర్‌ (1)లు నిరాశపరిచారు. బుమ్రా (0), ప్రసిద్‌ కృష్ణ (1) వికెట్లు సమర్పించుకోగా.. మహ్మద్‌ సిరాజ్‌ (3 నాటౌట్‌) అజేయంగా నిలిచాడు. 113 ఓవర్లలో 471 పరుగులకు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. ఇంగ్లాండ్‌ పేసర్లు జోశ్‌ టంగ్‌ (4/96), బెన్‌ స్టోక్స్‌ (4/66) నాలుగు వికెట్ల ప్రదర్శనతో మెరిశారు. క్రిస్‌ వోక్స్‌ (103/0) చెత్త గణాంకాలను మూటగట్టుకున్నాడు.
లంచ్‌ విరామం తర్వాత ఐదు ఓవర్లకే భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగియగా.. ఆ తర్వాత వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. ఓ సమయంలో ఇంగ్లాండ్‌ ఓపెనర్లు, భారత ఆటగాళ్లు గ్రౌండ్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతుండగా వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. టీమ్‌ హడిల్‌లో గిల్‌ మాట్లాడుతూ ఆటగాళ్లను ఉత్తేజపరుస్తున సమయంలోనూ మళ్లీ వర్షం రంగ ప్రవేశం చేసింది.

స్కోరు వివరాలు :
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : యశస్వి జైస్వాల్‌ (బి) స్టోక్స్‌ 101, కెఎల్‌ రాహుల్‌ (సి) రూట్‌ (బి) కార్స్‌ 42, సాయి సుదర్శన్‌ (సి) స్మిత్‌ (బి) స్టోక్స్‌ 0, శుభ్‌మన్‌ గిల (సి) టంగ్‌ (బి) బషీర్‌ 147, రిషబ్‌ పంత్‌ (ఎల్బీ) టంగ్‌ 134, కరుణ్‌ నాయర్‌ (సి) పోప్‌ (బి) స్టోక్స్‌ 0, రవీంద్ర జడేజా (బి) టంగ్‌ 11, శార్దుల్‌ ఠాకూర్‌ (సి) స్మిత్‌ (బి) స్టోక్స్‌ 1, బుమ్రా (సి) బ్రూక్‌ (బి) టంగ్‌ 0, సిరాజ్‌ నాటౌట్‌ 3, ప్రసిద్‌ కృష్ణ (బి) టంగ్‌ 1, ఎక్స్‌ట్రాలు : 31, మొత్తం : (113 ఓవర్లలో ఆలౌట్‌) 471.
వికెట్ల పతనం : 1-91, 2-92, 3-221, 4-430, 5-447, 6-453, 7-454, 8-458, 9-469, 10-471.
బౌలింగ్‌ : క్రిస్‌ వోక్స్‌ 24-4-103-0, బ్రైడన్‌ కార్స్‌ 22-5-96-1, జోశ్‌ టంగ్‌ 20-0-86-4, బెన్‌ స్టోక్స్‌ 20-2-66-4, షోయబ్‌ బషీర్‌ 27-6-100-1.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -