– భారత్ తొలి ఇన్నింగ్స్ 358/10
– బెన్ స్టోక్స్ ఐదు వికెట్ల ప్రదర్శన
– ఇంగ్లాండ్తో నాల్గో టెస్టు రెండో రోజు
పేసర్లకు అనుకూలించిన ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్పై టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులు చేసింది. టాప్-5 బ్యాటర్లలో కెప్టెన్ గిల్ మినహా అందరూ మెరిసినా.. భారత్ ఆశించిన స్కోరు అందుకోలేదు. రిషబ్ పంత్ (54) గాయంతో బ్యాటింగ్ చేసి అర్థ సెంచరీతో రాణించాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (5/72) ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.
నవతెలంగాణ-మాంచెస్టర్
‘టెండూల్కర్-అండర్సన్’ ట్రోఫీ నాల్గో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్లో 358/10 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ పేసర్లు నిప్పులు చెరిగినా.. తొలి రోజు మెరుగ్గా ఆడిన భారత్ రెండో రోజు అంచనాలను అందుకోలేదు. ఓవర్నైట్ స్కోరు (264)కు మరో 94 పరుగులే జోడించింది. రిషబ్ పంత్ (54, 75 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు) అర్థ సెంచరీతో మెరువగా.. శార్దుల్ ఠాకూర్ (41, 88 బంతుల్లో 5 ఫోర్లు) రాణించాడు. 44 పరుగులకే ఆఖరు ఐదు వికెట్లు చేజార్చుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్లో 114.1 ఓవర్లలో 10 వికెట్లకు 358 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (5/72), జోఫ్రా ఆర్చర్ (3/73) వికెట్ల వేటలో రాణించారు.
పంత్, శార్దుల్ రాణించగా..
విలక్షణ స్వీప్ షాట్ ఆడుతూ గాయపడిన పంత్.. ఇబ్బంది పడుతూనే క్రీజులోకి వచ్చాడు. సూపర్ ఫామ్ కొనసాగిస్తూ మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 69 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. పంత్ మెరుపులతో భారత్ మెరుగైన స్కోరు చేసింది. కానీ ముగ్గురు ఆల్రౌండర్లలో ఇద్దరు నిరాశపరచటం దెబ్బతీసింది. భీకర ఫామ్లో ఉన్న రవీంద్ర జడేజా (20, 40 బంతుల్లో 3 ఫోర్లు) ఓవర్నైట్ స్కోరుకు ఒక్క పరుగే జోడించి పెవిలియన్కు చేరాడు. వాషింగ్టన్ సుందర్ (27, 90 బంతుల్లో 2 ఫోర్లు) సహనంతో క్రీజులో నిలబడినా.. పరుగులు రాబట్టలేదు. శార్దుల్ ఠాకూర్ (41) పంత్కు తోడుగా నిలిచి విలువైన పరుగులు జోడించాడు. టెయిలెండర్లు అన్షుల్ (0), బుమ్రా (4) నిరాశపరిచారు. మహ్మద్ సిరాజ్ (5 నాటౌట్) అజేయంగా నిలిచాడు.
ఓపెనర్ల అర్థ సెంచరీలు :
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్ అర్థ సెంచరీలు సాధించారు. భారత బౌలర్లపై ఎదురుదాడి చేసిన ఓపెనర్లు.. ఓవర్కు సగటున 5కు పైగా పరుగులు పిండుకున్నారు. దీంతో 21 ఓవర్లలో ఇంగ్లాండ్ 109/0 పరుగులు చేసింది. భారత బౌలర్లు బుమ్రా, అన్షుల్, సిరాజ్, శార్దుల్ వికెట్ ప్రయత్నం ఫలించలేదు.