ప్రతిపక్షం లేని సమయంలో రెండు బిల్లులు ఆమోదించుకున్న ప్రభుత్వం
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
బీహార్లో ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. అనంతరం ప్రతిపక్షాలు ఎన్నికల సంఘం కార్యాలయానికి ప్రదర్శన చేపట్టడం, ప్రతిపక్ష ఎంపీలు అరెస్టు అయ్యాక తిరిగి సభలు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో ప్రభుత్వం నేషనల్ డోపింగ్ బిల్, ఆదాయ పన్ను బిల్లుల్ని ఆమోదించుకుంది. సోమవారం లోక్సభను స్పీకర్ ఓంబిర్లా ప్రారంభిస్తూ ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. ప్రతిపక్ష ఎంపీలు ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని వెల్లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. ఓటు చోరీ ఆపాలని పెద్దపెట్టున నినాదాల హౌరెత్తించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. ఇటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభ్యులు లేవనెత్తిన అత్యవసర అంశాలను చర్చించాలని రూల్ 267 కింద ఇచ్చిన 29 నోటీసులను తిరస్కరించారు. పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడిన తరువాత ప్రతిపక్ష ఇండియా బ్లాక్ ఎంపీలు ఎన్నికల సంఘం కార్యాలయానికి ర్యాలీ చేపట్టారు. వారిని మార్గమధ్యంలోనే ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. తిరిగి మధ్యాహ్నం రెండు గంటలకు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. అయితే అరెస్టు అయిన ప్రతిపక్ష ఎంపీలు విడుదల కాకపోవడంతో వారు సభకు హాజరుకాలేకపోయారు. దీంతో ప్రతిపక్ష ఎంపీలు లేకుండానే సభను నిర్వహించారు. లోక్సభలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయా ప్రవేశపెట్టిన జాతీయ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు, నేషనల్ యాంటీ డోపింగ్ సవరణ బిల్లుల్ని ఆమోదించారు. అనంతరం ఆదాయపు పన్ను బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లును కూడా ఆమోదించుకున్నారు. ఈ లోపు ప్రతిపక్ష సభ్యులు విడుదల అయి సభకు చేరుకున్నారు. అనంతరం సభలో తమ ఆందోళనను కొనసాగించారు. ఆ వెంటనే సభను మంగళవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టిన గోవా అసెంబ్లీలో కొన్ని షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టి) రిజర్వేషన్లు కల్పించే బిల్లు, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రవేశపెట్టిన మర్చంట్ షిప్పింగ్ బిల్లు ఆమోదించారు.
ఒకే దేశం- ఒకే ఎన్నిక జేపీసీ భేటీ
‘ఒక దేశం ఒకే ఎన్నిక’ జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) చైర్పర్సన్, బీజేపీ ఎంపీ పీపీి చౌదరి అధ్యక్షతన ఆ కమిటీ సమావేశం సోమవారం పార్లమెంట్ అనెక్స్ భవనంలో జరిగింది. హర్యానా సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ సుష్మా యాదవ్, మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ వినరు సహస్రబుద్ధే, ప్రొఫెసర్ షీలా రారు, రాష్ట్రీయ సమాజ్ విజ్ఞాన పరిషత్, గౌహతి యూనివర్శిటీ ప్రొఫెసర్ నాని గోపాల్ మహంత ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా దద్దరిల్లిన పార్లమెంట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES