Friday, June 6, 2025
E-PAPER
Homeజాతీయంజులై 21 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు

జులై 21 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు

- Advertisement -

ఆగస్టు 12 వరకు నిర్వహణ
23 రోజుల పాటు సభా కార్యకలాపాలు
షెడ్యూల్‌ ప్రకటించిన కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 21 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. మొత్తం 23 రోజుల పాటు సభా కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఈ మేరకు
జులై 21 నుంచి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు పార్లమెంట్‌ సమావేశాల షెడ్యూల్‌ను ప్రకటించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కీలకమైన బిల్లులను కూడా కేంద్రం ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. జాతీయ భద్రత, ఆర్థిక స్థితిగతులపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. బీమా సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశముందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 100 శాతానికి పెంచుతున్నట్టు తెలుస్తోంది. మీడియా నివేదికల ప్రకారం బిల్లు ముసాయిదా సిద్ధంగా ఉంది. ఇది త్వరలో ఆమోదం కోసం క్యాబినెట్‌ ముందుకు రానుంది. క్యాబినెట్‌ ఆమోదం పొందిన తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టే ప్రక్రియను ప్రారంభిస్తుంది.
ప్రతిపక్ష నేతలు వేటిపై చర్చకు పట్టుబట్టారంటే..
పహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించిన విషయాలపై పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశంలో ఏర్పాటు చేసి చర్చించాలని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. భారత్‌-పాక్‌ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి తానే మధ్యవర్తిత్వం వహించానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనపై కూడా ఈ సందర్భంగా చర్చించాలని పట్టుబట్టారు. సరిహద్దు గ్రామాల్లో పాక్‌ రేంజర్లు జరిపిన షెల్లింగ్‌లో ప్రాణాలు విడిచిన పౌరుల గురించి కూడా చర్చించాలని గుర్తు చేశారు. ఉగ్రదాడి అనంతరం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ విషయంలో తమ పార్టీలు ప్రభుత్వానికి మద్దతునిచ్చాయన్న ప్రతిపక్ష నేతలు.. తమ డిమాండ్‌ మేరకు కేంద్రం ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, అందుకు ప్రభుత్వం నిరాకరించటంతో ఈ సమావేశాలను ఉపయోగించుకోవాలని ప్రతిపక్షాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు రెండు భాగాలుగా జరిగాయి. మొదటి సమావేశం జనవరి 31న ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకూ కొనసాగింది. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల రెండో భాగం మార్చి 10న ప్రారంభమై ఏప్రిల్‌ 4న ముగిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -