నవతెలంగాణ-హైదరాబాద్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశమయ్యాయి. సభా కార్యకలాపాలు ప్రారంభంకాగానే ఇటీవలే మృతి చెందిన సభ్యులకు లోక్సభ సంతాపం వ్యక్తం చేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై చర్చించాలని లోక్సభలో కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. అంతేకాదు, ఢిల్లీ పేలుడు నేపథ్యంలో జాతీయ భద్రత, కార్మిక కోడ్లపైనా చర్చించాలని కోరాయి.
ఈ సమావేశాల్లో కేంద్రం 14 బిల్లులను ప్రవేశపెట్టనుంది. పలు సంస్కరణల అజెండాను మోడీ ప్రభుత్వం ముందుకు తీసుకురానుంది. వీటిలో సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్, ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు, అణు ఇంధనం, కార్పొరేట్, బీమా, జాతీయ రహదారులు, మధ్యవర్తిత్వం-రాజీ చట్టాల సవరణ బిల్లులు ప్రధానమైనవి. ఇటీవల హఠాత్తుగా తెచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్లు, ఢిల్లీలో జరిగిన పేలుడు, దేశ రాజధానిలో పెరిగిపోతున్న కాలుష్యం, రైతులకు కనీస మద్దతు ధర తదితర అంశాలపై అధికార బీజేపీని నిలదీయడానిక విపక్షాలు సిద్ధమయ్యాయి. జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో అనూహ్య పరిస్థితుల్లో ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణన్ నేతృత్వంలో తొలిసారిగా రాజ్యసభ సమావేశాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 19 వరకు జరిగే ఈ సమావేశంలో మొత్తం 15 పనిదినాలు ఉంటాయి.



