నవతెలంగాణ-హైదరాబాద్ : పాశమైలారం సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో మృతుల సంఖ్య 44కు చేరింది. ఈ ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో ఇద్దరు మృతి చెందారు. పనేషియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరిఫ్, ధ్రువ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అఖిలేశ్వర్ మృతి చెందారు. ఇవాళ ఇద్దరి మృతితో ఈ ఘటనలో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 44కు చేరింది.
మరోవైపు నేడు పాశమైలారం సిగాచీ పరిశ్రమకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బృందం రానుంది. ఘటనా స్థలాన్ని NDMA బృందం పరిశీలించనుంది. పరిశ్రమలో పేలుడుకు గల కారణాలపై ఎస్డీఎంఏతో కలిసి అధ్యయనం చేయనుంది. ప్రమాదానికి గల కారణాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇవ్వనుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచనలు చేయనుంది.