రాకపోకలు నిలిపివేత
ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో 18 మంది మృతి
గాజా : ఇజ్రాయిల్ దళాలు మరోసారి గాజాపై విరుచుకుపడ్డాయి. బుధవారం జరిపిన వైమానిక దాడుల్లో నలుగురు చిన్నారులు సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉద్రిక్తతల నేపథ్యంలో రఫా సరిహద్దును దాటేందుకు రోగులను అనుమతించడం లేదు. దీంతో వారంతా రఫా క్రాసింగ్ వద్ద పడిగాపులు పడుతున్నారని పాలస్తీనా అధికారులు తెలిపారు. ఒక సాయుధుడు తమ సైనికులపై కాల్పులు జరిపాడని, ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారని, దీంతో గాజాపై ట్యాంకులతో కాల్పులు జరిపామని, వైమానిక దాడులు కూడా జరిగాయని ఇజ్రాయిల్ సైన్యం చెబుతోంది.
గాజాను, దక్షిణాన ఉన్న ఖాన్ యూనిస్ నగరాన్ని లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్ దాడులు జరిపింది.
రఫా సరిహద్దు మీదుగా ఈజిప్ట్ వెళ్లేందుకు రోగులు ప్రయత్నించగా ఇజ్రాయిల్ సైన్యం అడ్డుకుంది. ఈ సరిహద్దును రెండు రోజుల క్రితమే తెరిచారు. చికిత్స నిమిత్తం ఈజిప్ట్ వెళ్లేందుకు అనేక మంది రోగులు ఖాన్ యూనిస్లోని ఆస్పత్రికి చేరుకోగా వారికి నిరాశే ఎదురైంది. దీంతో అనేక మంది రోగులు అంబులెన్సులలోనే వేచి చూస్తున్నారు. కాగా రఫా క్రాసింగ్ తెరిచే ఉన్నదని, అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి సమన్వయ సమాచారం అందకపోవడంతో రోగులను పంపలేకపోతున్నామని ఇజ్రాయిల్ సంస్థ కోగట్ తెలిపింది. కాగా కాల్పుల విరమణ మొదలైనప్పటి నుంచి ఇజ్రాయిల్ సైన్యం జరిపిన దాడుల్లో కనీసం 530 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది పౌరులే.



