Friday, November 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకల్లుగీత కార్మికులకు పరిహారం చెల్లించండి

కల్లుగీత కార్మికులకు పరిహారం చెల్లించండి

- Advertisement -

వారికిచ్చే పెన్షన్‌పై క్షేత్రస్థాయి పరిశీలన చేయాలి
నాన్‌డ్యూటీ లిక్కర్‌ అరికట్టండి : సమీక్షా సమావేశంలో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రఘునందన్‌రావు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కల్లుగీత కార్మికులు చనిపోయినప్పుడు, ప్రమాదాల్లో గాయపడిన సంఘటనల్లో వారికి సకాలంలో పరిహారం చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రఘునందన్‌రావు అధికారుల్ని ఆదేశించారు. బడ్జెట్‌ రాక పోవడంతో కొందరికి పరిహారం చెల్లించలేకపోతున్నామంటూ అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తానే స్వయంగా ప్రభుత్వంతో మాట్లాడతానని ఆయన చెప్పారు. గీత కార్మికులకు చెల్లించే పెన్షన్‌ వివరాలను రికార్డుల్లో రాయడంతో పాటు వారికి సకాలంలో అందుతున్నాయో లేదో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని ఆదేశించారు. అలాగే చనిపోయిన గీత కార్మికుల స్థానంలో కొత్తవారికి పెన్షన్‌ అందించేందుకు కృషి చేయాలని సూచించారు. గురవారంనాడిక్కడి ఆబ్కారీ భవన్‌లో ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాన్‌ డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌ను అరికట్టాలనీ, ఆ దిశగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్‌లు పని చేయాలని చెప్పారు.

కొత్త మద్యం పాలసీ ప్రకారం దుకాణాల కేటాయింపులు పూర్తయ్యాయనీ, అక్రమ మద్యాన్ని అరికట్టి, దుకాణదారులకు అమ్మకాలు పెరిగేలా సహకరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ సీ హరికిరణ్‌ పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా తెలంగాణ బేవరీజెస్‌ అమ్మకాలు, మద్యం తయారీ కంపెనీల వివరాలు, తయారీ, వినియోగం, లేబుల్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం పనితీరు వంటి పలు అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి రఘునందనరావు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కొత్త ఎక్సైజ్‌ స్టేషన్ల ఏర్పాట్లు, చెక్‌ పోస్టులను పటిష్టత, మద్యం తయారీ పరిశ్రమల్లో నిరంతర తనిఖీలు చేపట్టాలని చెప్పారు. సమావేశంలో అడిషనల్‌ కమిషనర్‌ సయ్యద్‌ యాసిన్‌ ఖురేషి, జాయింట్‌ కమిషనర్‌ సురేష్‌ రాథోడ్‌, ఎస్టీఎఫ్‌ అసిస్టెంట కమిషనర్‌ ప్రణవి, శ్రీధర్‌ (లెబుల్‌), శీలం శ్రీనివాస్‌ (లీగల్‌), శ్రీనివాస్‌, అసిస్టెంట్‌ సర్వీసెస్‌ నాగలక్ష్మీ, టీజీబీసీఎల్‌ జనరల్‌ మేనేజర్లు శ్రీనివాసరావు, ప్రమోద్‌, అశా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -