Wednesday, June 18, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిశాంతియుత పరిష్కారం

శాంతియుత పరిష్కారం

- Advertisement -

అమెరికా అండదండలతో ఇజ్రాయిల్‌ ఏకపక్షంగా ఇరాన్‌పై దాడులు చేయడం దుర్మార్గం, గర్హనీయం. నెతన్యాహు సర్కారు గాజాలో మొదలుపెట్టిన నరమేధాన్ని క్రమంగా విస్తరిస్తూ… పశ్చిమాసియాను అగ్నిగుండంగా మార్చేసింది. యుద్ధాలను ఆపేస్తానంటూ గద్దెనెక్కిన ట్రంప్‌… వాటికి మరింతగా ఆజ్యం పోస్తూ… ప్రపంచానికే పెనుముప్పుగా పరిణమిస్తున్న విధ్వంసాలకు మద్దతుగా నిలవడం గర్హనీయం.
అమెరికాను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ట్రంప్‌ అనుసరించిన సుంకాల యుద్ధం స్వదేశంలోనే వ్యతిరేకతను తెచ్చిపెట్టింది. ఉక్రెయిన్‌ యుద్ధం ఆపానన్న ప్రకటనలు ఆచరణ రూపం దాల్చలేదు. ఈ పరిస్థితుల్లో నెతన్యాహు భుజాలపై నుంచి ఇరాన్‌తో యుద్ధం చేస్తున్నాడు. ఐదు రోజుల క్రితం ఆకస్మికంగా దాడి చేసి తాజా ఉద్రిక్తతలకు నాంది పలికిన ఇజ్రాయిల్‌… అణ్వస్త్రాల తయారీకి ఇరాన్‌ చేరువలో ఉన్నందున ఆ ప్రయత్నాలను అడ్డుకోవడం, ఇరాన్‌ సుప్రీం నేత, మత పెద్ద ఖమేనీ కనుసన్నల్లోని ప్రభుత్వాన్ని పడగొట్టడం లక్ష్యాలుగా దాడులు చేసినట్టు నెతన్యాహు ప్రకటించుకున్నారు. ఆకస్మిక దాడులతో ఇరాన్‌ కీలక ఆర్మీ కమాండర్లను కోల్పోయింది. అణుకేంద్రాన్ని, దక్షిణ ఇరాన్‌లోని ప్రపంచంలోనే అతి పెద్ద సహజవాయు క్షేత్రాన్ని, టెహ్రాన్‌ వెలుపల చమురు డిపోను ఇజ్రాయిల్‌ సైన్యం పేల్చివేసింది. ఇరాన్‌ ప్రతిదాడులు చేయడంతో టెల్‌ అవీవ్‌ కూడా వణికిపోతోంది. రెండు దేశాల రాజధానుల్లోని పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇజ్రాయిల్‌ గూఢచారి సంస్థ మొసాద్‌ కార్యాలయం సైతం ఆహుతైంది. అమెరికా, ఇజ్రాయిల్‌లు ప్రచారం చేసుకున్న ఐరన్‌ డోమ్‌ రక్షణ ఉన్నా టెల్‌ అవీవ్‌ కకావికలం కావడం గమనార్హం. జి-7 సదస్సు నుంచి హుటాహుటిన వాషింగ్టన్‌కు ట్రంప్‌ వెళ్లిపోవడం, టెహ్రాన్‌ను ఖాళీ చేయాలంటూ ట్రంప్‌, ఇజ్రాయిల్‌ హెచ్చరించడం ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.
నెతన్యాహు వాదన అబద్ధమనడానికి అణుబాంబు తయారీకి దరిదాపుల్లో కూడా ఇరాన్‌ లేదని సాక్షాత్తు అమెరికా ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కొన్ని వారాల క్రితమే ప్రకటించడం రుజువు. ఏ దేశంలోనైనా పాలకులను నిర్ణయించుకునేది ఆ దేశ ప్రజలే. ఒక దేశంలో ప్రభుత్వాలను మార్చాలని మరో దేశం ప్రయత్నించడం ఆ దేశ సార్వభౌమత్వంపై, అంతర్జాతీయ న్యాయ సూత్రాలపై దాడే. ఇరాక్‌లో రసాయన ఆయుధాలున్నాయంటూ సద్దాం హుస్సేన్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు అమెరికా పన్నిన కుయుక్తులు అందరికీ తెలిసినవే. ఇప్పుడు ట్రంప్‌ వత్తాసుతో ఇజ్రాయిల్‌ చేస్తున్నదీ అదే. యుద్ధం ఆగితే.. గద్దె దిగి.. యుద్ధ నేరాలను ఎదుర్కొనే స్థితిలో ఉన్న నెతన్యాహు సాగిస్తున్న దమనకాండ అత్యంత గర్హనీయం. హమాస్‌ పేరుతో గాజాపై, హౌతీల పేరుతో యెమెన్‌పై విరుచుకుపడి, పాలస్తీనాలో 55 వేల మందికిపైగా… అందునా చిన్నారులు, మహిళలను ఊచకోత కోసిన ఇజ్రాయిల్‌ పాపాలు చరిత్రలో ఎప్పటికీ చెరగని చీకటి అధ్యాయానికి గుర్తుగా నిలిచిపోయేవే. చమురుపై ఆధిపత్యం కోసం, పశ్చిమాసియాపై పట్టుకోసం ఇజ్రాయిల్‌ నరమేధాన్ని ప్రోత్సహిస్తున్న అమెరికాతోపాటు పశ్చిమ దేశాల పాపం కూడా చిరకాలం నిలిచిపోయేదే.
గతంలో ఇరాన్‌తో ఒబామా కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసి సమస్యకు కారణమయ్యిందీ, యుద్ధాల నుంచి ప్రపంచాన్ని విముక్తి చేస్తానంటూ బీరాలు పలికిందీ ట్రంపే. ఇజ్రాయిల్‌కు వత్తాసు పలుకుతూ… ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేస్తుండటంపై సగటు అమెరికన్లతోపాటు స్వపక్షంలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
అమెరికాతో అణుచర్చలు సాగుతున్న సమయంలో రెండు రోజుల్లో ఆరోదఫా కీలక చర్చలతో సమస్యకు పరిష్కారమవుతుందని ఆశిస్తున్న వేళ ఇజ్రాయిల్‌ చేపట్టిన దాడులు ప్రపంచ శాంతికి భంగకరం. పర్షియన్‌ గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై దాడులు, హార్ముజ్‌ జలసంధిని మూసివేయడం ద్వారా ఒమన్‌ గల్ఫ్‌లోని ట్యాంకర్లను లక్ష్యం చేసుకోవడం ద్వారా ఇరాన్‌ ప్రతీకారం తీర్చుకుంటే భద్రతతోపాటు ప్రపంచాన్ని మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేసేదే. ఈ పరిణామాలతో పెట్రో ధరలు 40 శాతం పెరగొచ్చని అంచనా. 80 శాతం దిగుమతులపై ఆధారపడిన భారత్‌ ఆర్థిక వ్యవస్థకూ అశనిపాతమే! తన రాజకీయ అవసరాల కోసం ప్రపంచ శాంతిని పణంగా పెట్టిన నెతన్యాహును, చిరకాల మిత్రదేశమైన ఇరాన్‌నూ ఒకే గాటన కట్టడం ఎంతమాత్రం ‘విశ్వగురు’కు తగదు. ఇండియా, పాక్‌ యుద్ధాన్ని ఆపేశానంటూ తాజాగా మరోసారి చెప్పుకున్న ట్రంప్‌ వ్యాఖ్యలను పార్లమెంట్‌ సాక్షిగా ఖండించాల్సిన ప్రధాని అమెరికా తొత్తులా మూగనోము పట్టడం సిగ్గుచేటు. ప్రపంచ శాంతికి పెనుముప్పుగా మారిన ఇజ్రాయిల్‌ వైఖరిని అన్ని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టి, సంబంధాలను తెగతెంపులు చేసుకోవడంతోపాటు ప్రపంచ దేశాలతో కలిసి ఒత్తిడి చేయడం ద్వారా టెహ్రాన్‌ – టెల్‌ అవీవ్‌ల మధ్య మంటలను ఆర్పి, శాంతియుత పరిష్కారం కనుగొనడంలో భాగస్వామిగా మారడం భారత్‌ ప్రయోజనాలకు తక్షణ అవసరం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -