Friday, May 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఉపాధి కూలీల పెండింగ్‌ బకాయిలు విడుదల చేయాలి

ఉపాధి కూలీల పెండింగ్‌ బకాయిలు విడుదల చేయాలి

- Advertisement -

– రాష్ట్రానికి అన్యాయంపై కేంద్రమంత్రులు నోరు విప్పాలి
– పట్టణ ప్రాంతాలకూ ‘ఉపాధి’ని విస్తరించాలి
– 30న కలెక్టరేట్ల వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయండి : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

గ్రామీణ ఉపాధి హామీ కూలీల పెండింగ్‌ బకాయిలు విడుదల చేయాలనీ, కొత్త జాబ్‌ కార్డులివ్వడంతో పాటు పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పనులు చేపట్టాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్‌ చేసింది. పనిదినాలకు 200 రోజులకు పెంచి రోజుకు రూ.600 వేతనం ఇవ్వాలని కోరింది. ఈ డిమాండ్లపై 30న కలెక్టరేట్ల ఎదుట జరిగే ధర్నాలను ఉపాధి కూలీలు, పట్టణ పేదలు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు బుధవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.నాగయ్య, ఆర్‌.వెంకట్రాములు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి పనిదినాలు, కూలీల జాబ్‌కార్డులలో పెద్ద ఎత్తున కోత పెట్టడాన్ని తప్పుబట్టారు. గతేడాది తెలంగాణకు 8 కోట్ల పని దినాలను ఇచ్చిన మోడీ సర్కారు ఇప్పుడు 6:5 కోట్లకు తగ్గించిందని విమర్శించారు. ఉపాధి పనుల కేటాయింపుల్లో తెలంగాణ జరుగుతున్న అన్యాయంపై కేంద్ర మంత్రులు, బీజేపీకి చెందిన ఎంపీలు మాట్లాడకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఆధార్‌, బ్యాంకు అకౌంట్‌, జాబ్‌కార్డుల లింకు లేదనే కారణంతో దేశంలోని 7.6 కోట్ల జాబ్‌కార్డులను తొలగించడాన్ని తప్పుబట్టారు. తక్షణమే ఆధార్‌ బేస్డ్‌ వేతనాల చెల్లింపు ప్రక్రియను ఆపాలని డిమాండ్‌ చేశారు. కేరళ వామపక్ష ప్రభుత్వం మాదిరిగా పట్టణ ప్రాంతాలకు కూడా ఉపాధి పనిని పెట్టాలని ప్రత్యేక నిధులను కేటాయించాలని డిమాండ్‌ చేస్తుంటే కేంద్రం పట్టించుకోవట్లేదని విమర్శించారు. కొత్త జాబ్‌కార్డులు జారీ కాకుండా వెబ్‌సైట్‌ను లాక్‌ చేయడాన్ని తప్పుబట్టారు. వెంటనే వెబ్‌ సైట్‌ను రీఓపెన్‌ చేయాలని కోరారు. గ్రామపంచాయతీలోనే జాబ్‌ కార్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. చట్టానికి విరుద్ధంగా వేతనాలను పెండింగ్‌లో పెట్టడం, పే స్లిప్పులు ఇవ్వకపోవడం సరిగాదని పేర్కొన్నారు. ఆన్లైన్‌ పేమెంట్‌ పేరు మీద బ్యాంకులో ఎప్పుడు డబ్బులు వేస్తారో తెలియని పరిస్థితికి కూలీలు నెట్టబడ్డారని వాపోయారు. పనిప్రదేశాల్లో కనీస సౌకర్యాలు ఉండట్లేదని వాపోయారు. కూలీలు పొరపాటున చనిపోతే వారి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ.25 లక్షలు ఎక్స్‌ గ్రేషియా ఇవ్వడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగమిచ్చి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అన్ని గ్రామాల్లోనూ ఫీల్డు అసిస్టెంట్లను నియమించాలని కోరారు. సీనియర్‌ మేట్లకు గ్రామపంచాయతీ చెట్లకు నీళ్లు పోసి వాచర్‌కు ప్రత్యేక పని దినాలు కల్పించడంతోపాటు గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఫీల్డ్‌ అసిస్టెంట్ల పెండింగ్‌ వేతనాలను విడుదల చేయాలని కోరారు. రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక చేయాలనీ, ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న వారందరికీ ఇండ్ల పట్టాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. భూమి లేని పేదలకు రూ.12వేలు, కౌలు రైతులకు 15వేల రూపాయలు, మహిళలకు రూ.2,500, వృద్ధులకు రూ.4 వేల పింఛన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -