అనుమతి లేని స్పెషల్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి
వికలాంగులందర్నీ సెల్ఫ్ హెల్ఫ్ గ్రూపుల్లో చేర్చాలి
ప్రజావాణి నోడల్ అధికారి దివ్యదేవరాజన్కు ఎన్పీఆర్డీ బృందం వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని పెండింగ్ పింఛన్లు అన్నింటినీ వెంటనే మంజూరు చేయాలనీ, సదరం సర్టిఫికెట్ ఉన్న ప్రతి ఒక్కరికీ యూడీఐడీ కార్డు జారీ చేయాలని ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్, ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య, కోశాధికారి ఆర్.వెంకటేశ్ డిమాండ్ చేశారు. అనుమతిలేని ఆటీజం, స్పీచ్, హియరింగ్, స్పెషల్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజావాణి నోడల్ అధికారి, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్కు వారు వినతిపత్రం అందజేశారు. వికలాంగుల సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. అన్ని సంక్షేమ పథకాలకు యూడీఐడీ కార్డులు వర్తింపజేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. యూడీఐడీ కార్డులను తీసుకెళ్తే డిపోలలో బస్సు పాసులు ఇవ్వని విషయాన్ని లేవనెత్తారు. రాష్ట్రంలో వికలాంగులతో ఏర్పాటు చేయబోతున్న 18వేల సెల్ఫ్ హెల్ఫ్ గ్రూపుల్లో ప్రతి వికలాంగున్ని కూడా చేర్చుకోవాలని కోరారు.
గ్రామానికి 5-10 మంది చొప్పున తీసుకుంటే మిగతా వికలాంగులకు తీవ్ర నష్టం జరుగుతుందని వాపోయారు. ఆ గ్రూపుల్లో చేరేవారికి రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇప్పించాలని విన్నవించారు. చేయూత పింఛన్లకు ఆదాయ పరిమితి విధించే జీవో 17లోని కఠిన నిబంధలను సరళీకరించాలని కోరారు. చేయూత పింఛన్లను పూర్తిస్థాయిలో ఇవ్వకుండా రూ.16 కట్ చేస్తున్న వైనాన్ని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు పింఛన్ లబ్దిదారుల వివరాలు ఎక్కడ కూడా నమోదు చేయడం లేదనీ, అన్ని గ్రామాల్లో లబ్దిదారుల వివరాల కోసం ప్రత్యేక రిజిస్టర్లలో పేర్లు నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్తామని హామీనిచ్చారు.
పెండింగ్ పింఛన్లు మంజూరు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES