– ‘పహల్గాం’పై పార్లమెంటు సమావేశం నిర్వహించాలి
– మావోయిస్టులతో చర్చలు జరపాలి
– హామీల అమలు కోసం ప్రజాఉద్యమాలు
– 30న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలకు మద్దతు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
నవతెలంగాణ -మహబూబ్నగర్
”పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలి.. గద్దె నెక్కేందుకు అబద్ధాల హామీలు ఇచ్చారు.. ఇప్పుడు ఆ హామీలు అమలు చేయలేమంటూ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో కేంద్ర, రాష్ట్ర పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలకు సిద్ధమవుతున్నాం..” అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్న సామెత మాదిరిగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ఉన్నాయని విమర్శించారు. భారత్, పాకిస్తాన్కు వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకుంటామని చెప్పి, మధ్యవర్తిత్వం వహించి కాల్పుల విరమణకు ఒప్పించామని.. లేకుంటే అణుయుద్ధం వచ్చేదంటూ అమెరికా అధ్యక్షులు ట్రంప్ చేసిన ప్రకటనపై ప్రధాని మోడీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల దాడిపై విదేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది కానీ.. పార్లమెంట్ సమావేశం నిర్వహించి దేశ ప్రజలకు చెప్పడం లేదని విమర్శించారు. ఈ సంఘటనపై వెంటనే పార్లమెంటు సమావేశం నిర్వహించి ఎంపీల అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పహల్గాం ఉగ్రవాదులను ఇప్పటి వరకు ఒక్కరినీ అరెస్టు చేయకపోవడం సందేహాలకు తావిస్తోందన్నారు.
ప్రపంచంలోనే భారత్ నాల్గవ అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ప్రధాని మోడీ నిటి ఆయోగ్ సమావేశంలో చెప్పడాన్ని తప్పుపట్టారు. దేశంలో ఒక్క శాతం ఉన్న కార్పొరేట్లు 40శాతం సంపదను కలిగి ఉన్నారని తెలిపారు. 70 శాతంపైగా ఉన్న పేదల చేతిలో 3 శాతం సంపద మాత్రమే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా పన్నుల టారిఫ్లో దిగుమతులపై జీరో శాతం, ఎగుమతులపై 25శాతం పన్నులతో భారతదేశ సంపదను విదేశాలకు దోచిపెట్టినట్టు ఉందని చెప్పారు. ఉపాధి హామీ చట్టం ద్వారా ఏడాదిలో 200 రోజులు పని కల్పించాలని, ప్రతిరోజూ రూ.600 కూలి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం నిర్వహిస్తున్న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలకు సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్షా 2026 మార్చిలోపు మావోయిస్టు లను లేకుండా చేస్తామని ప్రకటించడం సరికాదన్నారు. మావోయిస్టులతో చర్చలు జరపాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఆరు హామీలను సీఎం రేవంత్రెడ్డి నెరవేర్చాల్సిందేనని, లేదంటే గుణపాఠం తప్పదని జాన్వెస్లీ హెచ్చరించారు. నిధులు కేటాయించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతోపాటు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ.రాములు మాట్లాడుతూ.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఉదండాపూర్, వల్లూరు, 15 తండాల ప్రజలు నిర్వాసితులవుతున్నారని తెలిపారు. వారికి పునరావాసం, ఇతర సౌకర్యాలు కల్పించి తరలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జయలక్ష్మి, సీనియర్ నాయకుడు కిల్లె గోపాల్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నల్లవెల్లి కురుమూర్తి, పద్మ తదితరులు పాల్గొన్నారు.
రైతుల కోసం ప్రత్యేక బీమా పథకాన్ని ప్రకటించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.సాగర్
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో వివిధ పంటలకు ప్రకటించిన మద్దతు ధర ఒక్క రైతుకు కూడా గిట్టుబాటు కాదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి.సాగర్ అన్నారు. రైతుల పంటల ఉత్పత్తి ఖర్చులతో పోలిస్తే ఈ ధరలు ఏమాత్రం సరిపోవన్నారు. రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుం డానే ఏకపక్షంగా మద్దతు ధరలు ప్రకటించడం నిరంకుశ విధానమన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం రైతుపెట్టే పెట్టుబడిలో 50శాతం కలిపి మద్దతు ధర ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఫసల్ బీమాలో ఇప్పటివరకు చేరకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. తక్షణమే రైతుల కోసం ప్రత్యేక బీమా పథకాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి చెబుతున్న మాటల్లో నిజాలు లేవన్నారు. ఎకరానికి రూ.7500 ఇస్తామన్న భరోసా ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. ఈ వర్షాకాలం పెట్టుబడి సాయం నాట్లు వేసే వరకు ఇస్తామని మంత్రి ప్రకటించడం రైతులను మోసం చేయడమే అవుతుందన్నారు.
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES