– మంత్రి తుమ్మలకు ఉద్యోగుల ధన్యవాదాలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వ్యవసాయ శాఖలో పదేండ్లుగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల ప్రమోషన్లను త్వరితగతిన పూర్తి చేసినందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లోని సచివాలయంలో మంత్రికి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ జె. తిరుపతి నాయక్ మాట్లాడుతూ ప్రమోషన్ల విషయంలో కోర్టు కేసులు, సీనియారిటీ సమస్యలు ఉన్నప్పటికీ రెండు ఉద్యోగ సంఘాలను మంత్రి సమన్వయం చేశారని కొనియాడారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ప్రమోషన్ల ప్రక్రియను చాలా చాకచక్యంగా పూర్తి చేశారని తెలిపారు. వ్యవసాయశాఖ సెక్రెటరీ రఘునందన్ రావు ఆదేశాలను పాటిస్తూ, కింది స్థాయి ఉద్యోగులను సమన్వయ పరుస్తూ ఈ ప్రమోషన్లకు సహకరించిన వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ గోపికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. గడచిన రెండు నెలల కాలంలో అన్ని స్థాయిల్లో మొత్తం 88 ప్రమోషన్లు ఇచ్చారని పేర్కొన్నారు. వాటిలో అడిషనల్ డైరెక్టర్ 1, జాయింట్ డైరెక్టర్స్ 18, డిప్యూటీ డైరెక్టర్స్ 42, అసిస్టెంట్ డైరెక్టర్స్ 27 మంది ఉన్నారని తెలిపారు. వీరికి చివరగా 2016, 2018లో ప్రమోషన్లు ఇచ్చారని గుర్తు చేశారు. ఈ ప్రమోషన్ల ద్వారా ఉద్యోగుల్లో ఉన్న నిరాశ తొలగి, మానసిక ఉత్సాహాన్నిస్తుందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను మరింత చురుకుగా అమలు చేస్తారని తెలిపారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న అధికారులకు వాహన సౌకర్యం, ప్రతి వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఒక అటెండర్, ఇతర సౌకర్యాలను కల్పించేందుకు దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపకులు కే.రాములు, అధ్యక్షులు సల్మాన్ నాయక్, కోశాధికారి మధుమోహన్, నాయకులు నిశాంత్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్లో ఉన్న ప్రమోషన్లుపూర్తి చేశారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES