– 27న చలో హైదరాబాద్
– ఆగస్ట్ 30,31 తేదీల్లో మహబూబాబాద్లో గ్రామ పంచాయతీ యూనియన్ రాష్ట్ర మహాసభలు
– జులై 9న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి:
యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పాలడుగు భాస్కర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య
నవతెలంగాణ-మహబూబాబాద్
గ్రామ పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రతతో పాటు హక్కుల పరిరక్షణకై నిరంతరం పోరాడుతున్న తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర 5వ మహాసభలు ఆగస్టు 30, 31 తేదీల్లో మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండల కేంద్రంలో జరుగుతాయని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పాలడుగు భాస్కర్, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జగన్నాధం భవనంలో రాష్ట్ర అధ్యక్షులు జి.పాండు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర మహాసభల సన్నాహాక సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారుల లాభాల కోసం కార్మికులను కట్టు బానిసలుగా మార్చేందుకు నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిందని, లేబర్ కోడ్ల రద్దుతో పాటు ఇతర డిమాండ్ల సాధనకై జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్రంలో పంచాయతీ కార్మికులు మల్టీ పర్పస్ వర్కర్ విధానంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, నైపుణ్యం లేని పనులు చేయడం వల్ల అనేకమంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, ఆదివారం, పండుగ సెలవులు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత, మల్టీ పర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 27న జరిగే చలో హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమానికి పంచాయతీ సిబ్బంది పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.
ఆహ్వాన సంఘం ఏర్పాటు
సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ రాష్ట్ర మహాసభల జయప్రదానికి ఆహ్వాన సంఘం కమిటీని ప్రకటించారు. ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులుగా జువ్వాజీ నర్సింహారావు, అధ్యక్షులుగా పాలడుగు భాస్కర్, ప్రధాన కార్యదర్శిగా బండ్ల అప్పిరెడ్డి, కోశాధికారిగా కుంట ఉపేందర్, చీఫ్ ప్యాట్రన్స్, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కమిటీ సభ్యులుగా 65 మంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు, నాయకులు పాలడుగు సుధాకర్, ఆకుల రాజు, కుమ్మరికుంట్ల నాగన్న, సమ్మెట రాజమౌళి, పోతుగంటి మల్లయ్య, వల్లాల వెంకన్న, జల్లే జయరాజు, బాబుగౌడ్, యూనియన్ జిల్లా నాయకులు ఎండీ మొయీనుద్దీన్, సుధాకర్, లతీఫ్, ఎల్లయ్య, సురేష్, అశోక్, మల్సూర్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ వేతనాలు ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES