సిఐటియు జిల్లా అధ్యక్షులు దాసరి పాండు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు దాసరి పాండు అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి, జిల్లా పంచాయతీ అధికారికి సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీలలో ఏళ్ల తరబడిగా కార్మికులుగా పనిచేస్తున్నారని అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల వేతనాలు చెల్లిస్తామని, సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పిన ప్రభుత్వము అమలు చేయలేదని అన్నారు. గ్రామాలలో డ్రైనేజీని ఇతర విధులు నిర్వహిస్తున్న కార్మికుల పట్ల నిర్లక్ష్యం తగదని అన్నారు.
జిల్లాలో ఒక నెల మొదలుకొని తొమ్మిది నెలలుగా గ్రామాల్లో కార్మికులకు వేతనాలు పెండింగ్లో ఉన్నాయని, ఇచ్చే వేతనాలు తక్కువ ఆ వేతనాలు కూడా సకాలంలో రాకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వెంటనే చిత్తశుద్ధితో గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని తెలిపారు. రికార్డులో పేరు లేని గ్రామపంచాయతీ కార్మికుల పేర్లను వెంటనే నమోదు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర మహిళా కన్వీనర్ పొట్ట యాదమ్మ, పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బందెల భిక్షం, గడ్డం ఈశ్వర్, నాయకులు బొల్లెపల్లి స్వామి, బాబు పరమేశు స్వామి, కిష్టయ్య, అనిత, లక్ష్మి పాల్గొన్నారు.