“మన మున్సిపాలిటీ – మన అభివృద్ధి” అవగాహన లో ఎమ్మెల్యే జారే.
నవతెలంగాణ – అశ్వారావుపేట : నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్నామని, అందులో భాగంగానే స్థానిక సత్యసాయిబాబా కళ్యాణమండపంలో సోమవారం ప్రజల భాగస్వామ్యం కోసం “మన మున్సిపాలిటీ – మన అభివృద్ధి” పేరుతో అవగాహన నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. అశ్వారావుపేట – పేరాయిగూడెం – గుర్రాల చెరువు పంచాయతీలను కలిపి కొత్త మున్సిపాలిటీగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎమ్మెల్యే జారే ఈ కార్యక్రమం చేపట్టారు.ప్రజాప్రతినిధులు,అధికారులు,మండలస్థాయి అఖిలపక్ష నాయకులు, మున్సిపాల్టీ అధికారులు పాల్గొన్న ఈ అవగాహన సదస్సులో కొత్త మున్సిపాలిటీ అభివృద్ధిపై ముఖ్యమైన సలహాలు సూచనలు అనుభవజ్ఞుల నుంచి సేకరించారు.నూతన మున్సిపాలిటీ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించ నున్నట్టు ఎమ్మెల్యే జారే వివరించారు.త్రాగునీటి సరఫరా,రహదారులు ఏర్పాటు,విద్యుత్ వ్యవస్థ, ఆరోగ్యం,విద్యా సదుపాయాలతో పాటు అన్ని రంగాల అభివృద్ధిపై దృష్టి పెట్ట నున్నామని అన్నారు.
మున్సిపాలిటీ రూపంలో అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రం అన్నివిధాలా అభివృద్ధి చెందుతుందన్నారు.నూతన మున్సిపాలిటీగా అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి,ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కు ఈ సందర్భంగా జారే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల భాగస్వామ్యం, సహకారం వల్లే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ సుజాత,మండల పరిషత్ ప్రత్యేక అధికారి,పశుసంవర్ధక శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ ప్రదీప్, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్,పట్టణ ప్రణాళిక అధికారి శ్రీనివాస్ లు పాల్గొన్నారు.