– ఐదుగురు విద్యార్థులు మృతి
– పదుల సంఖ్యలో క్షతగాత్రులు
అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఫ్లయిట్ నెంబర్ ఏఐ-171 కొన్ని నిమిషాల్లోనే ప్రమాదానికి గురయింది. జనావాసాలపై కూలిపోయింది. విమానంలోని కొన్ని భాగాలు అక్కడే ఉన్న బిజె మెడికల్ కాలేజీ యుజి హస్టల్ భవనాలపై పడ్డాయి. విద్యార్థులు భోజనం చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం మరింత విచారకరం.
విమానం భవనంపై పడిన వెంటనే ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్థులు మరణించారు. పదుల సంఖ్యలో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో నలుగురు అండర్ ఎంబిబిఎస్, ఒక పిజి విద్యార్థి ఉన్నారు. ఈ వివరాలను గుజరాత్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ధనంజయ్ ద్వివేది వెల్లడించారు. విమానం కూలిపోవడంతో విద్యార్థుల హస్టల్, స్టాఫ్ క్వార్టర్స్, అనేక నివాస గృహాలు దెబ్బతిన్నాయని చెప్పారు. విద్యార్థులతో పాటు స్థానికులు కూడా గాయపడ్డారని చెప్పారు. గాయపడిన 50 మంది విద్యార్థులు, స్థానికులను అహ్మదాబాద్లోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. కొంత మందికి తీవ్ర గాయాలైనా వారి పరిస్థితి స్థిరంగానే ఉందని వైద్యులు తెలిపారు. గాయపడిన వారందరికీ ఉత్తమ వైద్య చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. బాధితుల్ని గుర్తించడంలో సహయం కోసం బిజె మెడికల్ కాలేజ్ వద్ద డిఎన్ఎ పరీక్షను నిర్వహిస్తున్నారు.
కాగా, ప్రమాదం జరిగిన నిమిషాల్లో ఎన్డిఆర్ఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, స్థానిక పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మంటలను అదుపు చేసి సహాయక కార్యక్రమాలను వేగంగా ప్రారంభించారు. సిబ్బంది తక్షణమే అక్కడికి చేరుకోవడంతో పలువురిని సురక్షితంగా బయటకు తీశారు. విద్యార్థుల భోజనాలు చేస్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకోవడంతో మెస్లో ప్లేట్లు, ఆహారం చిందరవందరగా పడిన దృశ్యాలు వైరల్గా మరాయి. ప్రస్తుతం మూడు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. వడోదర నుంచి మరో రెండు బృందాలు కూడా అక్కడకు వచ్చాయి. ప్రమాదస్థలి నుంచి అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి వరకు గ్రీన్కారిడార్ను ఏర్పాటు చేశారు.