– మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి
– 7.80 లక్షల ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయనున్న సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్టుల పూర్తికి ప్రణాళికలు రూపొందించామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డి ప్రకటించారు. వీటిని పూర్తి చేయడం ద్వారా 7.80 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని వ్యాఖ్యానించారు. శనివారం నీటిపారుదల శాఖ కేంద్ర కార్యాలయం జలసౌధలో ఆ రెండు ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్అండ్ఆర్ కమిషనర్ వినరు కష్ణారెడ్డి, నీటిపారుదల శాఖా సలహాదారు ఆదిత్యనాధ్ దాస్, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్జీవన్ పాటిల్, ఈఎన్సీ అనిల్కుమార్, సీఈ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుతోపాటు సీతమ్మసాగర్ అనుమతులు, పనుల పురోగతి, భూసేకరణ, సంబంధిత అంశాలపై ఇంజినీర్లు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టుకు గత ప్రభుత్వ హయాంలో నీటి కేటాయింపులు సాధించ లేకపోయిందని తెలిపారు. కేవలం 16 నెలల వ్యవధిలో కాంగ్రెస్ ప్రభుత్వం సీడబ్ల్యూసీని ఒప్పించి 67 టీఎంసీల నీటిని కేటాయించేలా ఒత్తిడి చేసినట్టు చెప్పారు. ప్రాజెక్టు పురోగతిపై ఆయన స్పందిస్తూ ఇప్పటికే మూడు పంపుహౌజ్ల నిర్మాణం పూర్తి కావడంతో పాటు నాలుగో పంపుహౌజ్ నిర్మాణదశలో ఉందన్నారు. మొత్తం 97 శాతం పనులు పూర్తయినట్టు వివరించారు. పాలేరు లింక్ కెనాల్, సత్తుపల్లి ట్రంక్ కెనాల్, ఎన్కూర్ లింక్ కెనాల్ పురోగతిలో ఉన్నాయని గుర్తు చేశారు. భూసేకరణను పూర్తి చేయడంతో పాటు టన్నెల్ నిర్మాణాలకు సంబంధించిన పర్యావరణ అనుమతులు త్వరితగతిన పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. అదే సమయంలో పనులలో జరుగుతున్న జాప్యంపై ఆయన అధికారులను నిలదీశారు. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించాలని ఆయన అధికారులకు సూచించారు. తదుపరి సమీక్షా సమావేశం నాటికి భూసేకరణ పురోగతితో పాటు చెల్లింపులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సీతమ్మ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణ అనుమతులు వేగంగా తెచ్చి, పూర్తి చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని పనులు అనుమతులు లేకుండానే చేపట్టిన కారణంగా జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) విధించిన రూ. 53.41 కోట్ల జరిమానాను రద్దు చేసేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇదే ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మిస్తున్న 282.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి సంబంధించిన ప్రతిపాదనలు జెన్కోకు పంపించినట్టు తెలిపారు. దుమ్ముగూడెం-పాలేరు మెయిన్ కెనాల్ పూర్తికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, అందుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించుకుని పనుల్లో వేగం పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నా మన్నారు. ఇల్లెందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య ప్రతిపాదించిన ప్రతిపాదనలను అధ్యయనం చేస్తామనీ, సాధ్యాసాధ్యాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు.
సీతారామ, సీతమ్మసాగర్ ప్రాజెక్టుల పూర్తికి ప్రణాళికలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES