నవతెలంగాణ -సుల్తాన్ బజార్/సిటీబ్యూరో
హైదరాబాద్ నగరంలోని చాదర్ఘాట్లో గల విక్టోరియా ప్లే గ్రౌండ్లో కాల్పుల ఘటన కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లాలో కానిస్టేబుల్పై కాల్పులు.. హత్య ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే నగర నడిబొడ్డులో ఇద్దరు దొంగలు పోలీసులపై దాడికి యత్నిం చారు. ఈ సంఘటన సంచలనం రేపింది. హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం పాతబస్తీ కామాటిపురా ప్రాంతానికి చెందిన రౌడీషీటర్- మొబైల్ స్నాచర్ మహ్మద్ ఓమర్ అన్సారీ, మరో నిందితుడు కలిసి సెల్ఫోన్ చోరీ చేసి పారిపోతున్నారు. అదే సమయంలో హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య సీపీ కార్యాలయంలో జరిగిన మీటింగ్కు వెళ్లి తిరిగి తన కార్యాలయానికి వెళ్తున్న క్రమంలో పారిపోతున్న ఇద్దరు దొంగలను గన్మెన్ గమనించాడు. ఆ దొంగలను డీసీపీ పట్టుకునేం దుకు ప్రయత్నించారు. తప్పించుకునే ప్రయత్నంలో డీసీపీ, అతని గన్మెన్పై చైన్ స్నాచర్లు కత్తితో దాడికి దిగారు. ఈ క్రమంలో గన్మెన్ పడిపోయాడు. కత్తితో బెదిరిస్తూనే ఓ దొంగ చాదర్ఘాట్ సమీపంలోని ఇసామియా బజార్ టెలివిజన్ గల్లీలోకి వెళ్లాడు. అక్కడి నుంచి బయటపడేందుకు దారి లేకపోవడంతో ఓ భవనంపైకి ఎక్కి వెనుక భాగంలో ఉన్న విక్టోరియా ప్లే గ్రౌండ్లోకి దూకే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన డీసీపీ గన్ తీసుకొని రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. నిందితుడు ఒమర్ అన్సార్ చేతి భుజం, కడుపులో బుల్లెట్లు తగిలాయి. కాగా, మరొక మొబైల్ స్నాచర్ తప్పించుకున్నాడు. ఈ దాడిలో డీసీపీ మెడ, కాలి భాగంలో స్వల్ప గాయాలయ్యాయి. గన్మెన్ కింద పడిపోవడంతో అస్వస్థతకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని డీసీపీని, గన్మెన్ను, నిందితుడు ఓమర్ అన్సారీని వైద్య చికిత్స నిమిత్తం ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. విషయం తెలుసుకున్న సీపీ సజ్జనార్, పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లారు. పూర్తి వివరాలను అధికారులను అడిగి సీపీ తెలుసుకున్నారు.
ఆత్మ రక్షణలో భాగంగానే కాల్పులు : నగర సీపీ సజ్జనార్
చాదర్ఘాట్లో కాల్పుల ఘటనలో ఇద్దరు దొంగలు గాయపడ్డారని సీపీ సజ్జనార్ తెలిపారు. ఆత్మరక్షణలో భాగంగానే దొంగలపై డీసీపీ కాల్పులు జరిపారని, కాల్పుల్లో ఇద్దరు నిందితులు గాయపడ్డారని తెలిపారు. ఒమర్పై కాలాపత్తర్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ నమోదుకాగా, సెల్ఫోన్ల చోరీ కేసులతోపాటు 25 కేసులలో నిందితుడు అని సీపీ తెలిపారు. 2016లో కామాటిపురా పోలీస్స్టేషన్లో పీడీ యాక్టు కేసులో ఏడాది జైల్లో ఉన్నాడని, 2020లో హుస్సేనీ ఆలమ్ పోలీస్ స్టేషన్ పీడీ యాక్టు కేసులో సైతం మరో ఏడాది చంచల్గూడ జైల్లో ఉన్నాడని తెలిపారు. జైలు నుంచి బయటకు వచ్చినప్పటికీ ఓమర్ ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు.
పోలీస్ ఛేజింగ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



