బీజేపీ కార్యాలయం వద్ద ధర్నాకు
బయల్దేరిన నాయకుల అడ్డగింత
గాంధీభవన్ వద్దే బైటాయించి నిరసన
కక్షసాధింపు చర్యలు మానుకోవాలని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఈడీ కేసులతో తమ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను బీజేపీ వేధించడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. నేషనల్ హెరాల్డ్ విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ కక్షసాధింపులకు పాల్పడుతున్నదని ఆరోపిస్తూ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో గురువారం గాంధీభవన్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ర్యాలీగా బయల్దేరారు. వందలాది మంది కార్యకర్తలతో బీజేపీ కార్యాలయానికి బయల్దేరిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు గాంధీభవన్ వద్దే అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకురాలు సంధ్యారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సంధ్యారెడ్డికి ప్రాథమిక చికిత్స అందించారు.
అనంతరం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం నాయకులు, కార్యకర్తలు గాంధీభవన్ వద్దే బైటాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దేశం కోసం త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని బీజేపీ కేసులతో వేధిస్తున్నదని విమర్శించారు. ఢిల్లీ కోర్టులో ఈడీ వేసిన ఛార్జిషీట్ను కొట్టివేసిందని ఆయన గుర్తుచేశారు. మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ బీజేపీ బనాయిస్తున్న అక్రమ కేసుల గురించి ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని తెలిపారు. నేషనల్ హెరాల్డ్ విషయంలోనూ అదే జరుగుతుందని చెప్పారు. బీజేపీకి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పి తీరుతామని ఆమె హెచ్చరించారు.
కాంగ్రెస్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



