- – మార్గదర్శక శిక్షణతో ప్రజా సమస్యల పరిష్కారానికి దారి..
– మునుగోడు నియోజకవర్గస్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి..
– సీసీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం..
నవతెలంగాణ మునుగోడు : రాజకీయ చైతన్యం తోటే ప్రజా సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. జూలై 25న మర్రిగూడ మండల కేంద్రంలో నిర్వహించే మునుగోడు నియోజకవర్గస్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు నియోజవర్గంలోని పార్టీ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా బండ శ్రీశైలం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒక్కటీ నేటి వరకూ అమలుకావడం లేదని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ధరణి బదులు తీసుకువచ్చిన భూభారతి వ్యవస్థ ద్వారా రైతుల భూముల సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పినా, వాస్తవానికి ఎక్కడా పరిష్కారం కాలేదన్నారు. దరఖాస్తులు చేసినా ప్రభుత్వానికి జవాబుదారిత్వం లేదని, సమస్యల పరిష్కారంపై నమ్మకం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మర్రిగూడ మండలంలోని శివన్నగూడెం, కిష్టరాంపల్లి ప్రాజెక్టులకు సంబంధించిన నిర్వాసితులకు ఇప్పటికీ ఆర్ , ఆర్ పథకం పూర్తిగా అమలుకాలేదని, భూములు కోల్పోయిన రైతులకు ప్యాకేజీలు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని ప్రశ్నించేదిగా ఉందన్నారు.
అర్హులైన పేదలకు పెన్షన్లు ఇవ్వకుండా నాలుగు సంవత్సరాలుగా కొత్త పెన్షన్లు మంజూరుకాకపోవడం ఆందోళనకరమన్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఇప్పుడు కబ్జాకు గురవుతున్నాయని, నూతనంగా ప్రభుత్వం సేకరించిన భూమిలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్ , మండల కమిటీ సభ్యులు వరికుప్పల ముత్యాలు, యాస రాణి శ్రీను, యాట యాదయ్య , కాల్వలపల్లి గ్రామ కార్యదర్శి వంటెపాక అయోధ్య తదితరులు ఉన్నారు.