నవతెలంగాణ-హైదరాబాద్ : ఆంద్రప్రదేశ్ కు అక్రమంగా కృష్ణా జలాశయాల తరలింపుపై తుమ్మడిహట్టి నుండి మెడిగడ్డకు మార్చిన విషయమై ఈ నెల 9న ప్రజాభవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తెలంగాణా ప్రాంత ప్రజాప్రతినిధులకు ఈ అంశంపై సమగ్రమైన సమాచారాన్ని అందించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లు గౌరవ అతిథిలుగా పాల్గొననున్న ఈ కార్యక్రమం ఏర్పాట్లను రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
రాజ్యసభ, లోకసభ,శాసనమండలి,శాసనసభ సభ్యులతో పాటు నియోజకవర్గ ఇంచార్జ్ లు, కార్పొరేషన్ చైర్మన్ లకు నీటిపారుదల రంగ నిపుణులకు,అధికారులకు వ్యక్తిగతంగా ఆహ్వానాలు అంద జేశారు. తుమ్మడిహాట్టి నుండి మెడిగడ్డకు ప్రాజెక్టును మార్చడంతో ఏర్పడిన దురదృష్టకరమైన పరిణామాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ప్రజాప్రతినిధులకు వివరించి విరివిగా ఆ ప్రాజెక్టు మార్పు పై ఎన్.డి.ఎస్.ఏ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేసేందుకు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు
మెడిగడ్డ, అన్నారం,సుందిళ్ళ బ్యారేజ్ ల రూపకల్పన,నిర్మాణాలలో ఏర్పడ్డ సాంకేతిక అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సంకల్పించింది పైగా ప్రాజెక్టును మార్చడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం బి.ఆర్.ఎస్ ప్రభుత్వం భారీ వడ్డీలతో చేసిన అప్పులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గుదిబండగా మారిన అంశాన్ని కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వివరించనున్నారు.
2014 నుండి 2023 సాగిన బి.ఆర్.ఎస్ పాలనలో ఆంద్రప్రదేశ్ కు కృష్ణా జలాశయాలు అక్రమంగా తరలింపుపై ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా వివరించ నున్నారు.