మహాసభను జయప్రదం చేయాలి : ప్రముఖ డెంటల్ డాక్టర్ జీఎన్ రావు
రాష్ట్ర మహాసభ పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ – ముషీరాబాద్
ఈనెల 15, 16, 17 తేదీల్లో జరగనున్న ప్రజానాట్యమండలి రాష్ట్ర 3వ మహాసభను జయప్రదం చేయాలని ప్రముఖ డెంటల్ డాక్టర్ జీఎన్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్ర మహాసభ పోస్టర్ను గురువారం హైదరాబాద్లో ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కళ కల కోసం కాదు.. కళ ప్రజల కోసం.. కళ ప్రగతి కోసం అనే నినాదంతో ఏర్పడిన ప్రజానాట్యమండలి 80 సంవత్సరాలుగా తమ ఆట పాటతో ప్రజల పక్షాన నిలబడుతోందని తెలిపారు. పాలకులు ప్రజా సమస్యలను విస్మరించిన ప్రతి సందర్భంలో ప్రజలను చైతన్యవంతం చేస్తూ, ప్రజా కళాకారులను తీర్చిదిద్దడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
మహాసభ విజయవంతంగా జరగాలని, ప్రజాకళా కారులు, ప్రజావాగ్గేయకారులు, కవులు, రచయితలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో రవీంద్రభారతిలో జరగనున్న ఈ మహాసభకు రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 600 మంది ప్రజా, జానపద కళాకారులు హాజరవుతారని తెలిపారు. జానపద కళారూపాలను కాపాడటంలో ప్రజానాట్యమండలి ముందుంటుందన్నారు. జానపదాలు కనుమరుగవుతున్న తరుణంలో ప్రజానాట్యమండలి ఈ కార్యక్రమం నిర్వహించడాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో మహాసభ ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి మారన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నరసింహ, సహాయ కార్యదర్శి వినోద్, గోవర్ధన్, నగర కమిటీ సభ్యులు రాము, నగర నాయకులు పి.పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.



