Saturday, May 31, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిప్రస్థానం

ప్రస్థానం

- Advertisement -

”ముళ్ళూ, రాళ్ళూ అవాంతరాలెన్ని వున్నా
ముందు దారి మాది” అంటూ ఐదున్నర దశాబ్దాలు.. అదే వాడి.. అదే వేడి! సీఐటీయూది పయనమనగలమా? అదొక ఉధృతి. అదొక ప్రవాహం. దానిదొక ప్రస్థానం!
భారత కార్మికోద్యమం జాతీయోద్యమంతో పెనవేసుకుని పెరిగింది. అది జాతీయోద్యమంలో అంతర్భాగం. ఇతర అనేక మంది నేతలతో కలిసి బీటీఆర్‌, రామ్మూర్తి, జ్యోతిబసు వంటి వారు నిర్మించిన కార్మికోద్యమానికి కుక్క మూతి పిందెలు 1960 దశకం మధ్య నుంచే కాయడం మొద లుపెట్టినాయి. ‘రెండు స్తంభాల’ సిద్ధాంతం నాటి అధికార విధానమైంది. కన్నీరు లేకుండా హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్‌ వితౌట్‌ టియర్స్‌)ను ‘జాతి ప్రయోజనాల రీత్యా’ అంగీకరించారు నాటి నాయకులు. కోడ్‌ ఆఫ్‌ డిసిప్లీన్‌కు పచ్చజెండా ఊపారు. యూనియన్‌ కమిటీల్లో, జనరల్‌ బాడీల్లో ఏ చర్చ లేకుండానే వర్క్‌లోడ్స్‌ను, వేతనాలను ఒప్పేసుకునే వారు కొందరు. వీటిని ప్రశ్నిస్తే బహిష్కరణలు. ప్రతిఘటించి వర్గ చైతన్యంతో నిలిచిన యూనియన్లకు పోటీగా పుట్టగొడుగులు దేశమంతా మొలిపించారు. నాయకత్వానికి వర్గసంకరమంటుకుంది. ఆ చీడకు పురు గు మందులు పనిచేయలేదు. వర్గపోరాట సిద్ధాంతం ఆధారంగా నిలబడ గలిగే వారితో నూతన సంఘం ఆవిర్భావమే ఆనాటి ఆవశ్యకత. సీఐ టీయూ పుట్టుక నేపథ్యమది. తర్వాతి పరిణామాలకు మన కండ్లే సాక్షి.
ఆవిర్భావ మహాసభ నాటికి 1759 అనుబంధ యూనియన్లు, 8,04,637 సభ్యత్వం. భారత కార్మికోద్యమాన్ని ఐక్యం చేయడం కోసమే చీలిపోతున్నామన్న జ్యోతిబసు మాటలను పాలకవర్గ మీడియా ఎగతాళి చేసింది. నవ్విన నాపచేనే నేడు పండింది.
”ఇంతింతై, వటుడింతై
.. నభోవీధిపై నంతై
తోయగ మండలాగ్రమున అల్లంతై” అని పోతనా మాత్యుడన్నట్టు నేడు 4900 యూనియన్లు, 65లక్షల సభ్యత్వంతో అలరా రుతోంది. ఆ పెరుగుదల వెనుక యాజమాన్యాల కక్షసాధింపు చర్యలకు తోడు గూండాల కత్తిపోట్లు, ప్రాణాలకు వెరవని త్యాగం ఉన్నాయి.
కార్మిక సంఘాలకు ముళ్లేం గుచ్చుకుంటాయిలే, రాళ్ళేం అడ్డం పడతా యిలే అనుకోవద్దు. చాలా యాజమాన్యాలు ముళ్ళయి గుచ్చుకుంటూంటే, రాజ్యం రాళ్ళై కార్మికోద్యమానికి అడ్డు పడుతోంది. నేటి కార్మిక కోడ్‌లు ‘రాజ్యం’ చేసే దాడే. అది బీజేపీ దాడనుకుంటే పొరపాటు. వామపక్షాలు మినహా దాదాపు దేశంలోని అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఈ కార్మిక కోడ్‌లకుంది. ఇక్కడే కార్మికులను చైతన్యపరుచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆవిర్భావం నుంచి సీఐటీయూ దీనికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నది. కార్మికులను ఐక్యంగా నిలబెట్టగలిగితేనే పెట్టుబడిదాడిని నిలువరించగలం. ఈ విషయం భారతదేశ కార్మిక వర్గానికి అర్థమయింది. ఫలితంగా 22 అఖిల భారత సమ్మెలు ఐక్యంగా జరిగాయి. ఈ ఐక్యత గురించే కదా 1970లో జ్యోతిబసు చెప్పింది.
ప్రారంభ మహా సభలోనే బీటీఆర్‌ ”కార్మిక వర్గ ఐక్యతకు ట్రేడ్‌ యూనియన్ల నుంచే ప్రమాదం రాదు. కార్మిక వర్గ చైతన్యంపై నేడు (1970లో) మితవాద శక్తుల సైద్ధాంతిక దాడి తీవ్రస్థాయిలో పెరుగుతోంది. దీన్ని ప్రతిఘటించ కుండా కార్మిక వర్గ చైతన్యాన్ని బలంగా నిలబెట్టలేం. అపుడే దేశంలోని కార్మికో ద్యమాన్ని సజీవంగా ఉంచగలం” అన్నారు. నేడు ప్రమాదం అనేక వందల రెట్లు పెరిగింది. కులం, మతం, ప్రాంతం, తెగలవారీగా కార్మికులు, ఇతర కష్టజీవులు చీలిపోతున్నారు. 1990ల్లో మండల్‌ కమిషన్‌ వ్యతిరేక ఉద్యమం, రామ జన్మభూమి ఉద్యమం సంఫ్‌ు పరివార్‌కు రాచబాట పరిచింది. గడిచిన పదకొండేండ్ల బీజేపీ పాలన సమాజాన్ని నిలువునా చీలుస్తున్నది. నిచ్చెనమెట్ల కులవ్యవస్థని మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నది. మనువును ఆవాహన చేస్తున్నది. భారత రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని ప్రవేశపెట్టడానికి ఉవ్విళ్ళూరుతున్నది. ఇప్పటికే మైనారిటీలను రెండో తరగతి పౌరుల స్థాయికి దిగజార్చింది. ఈ ప్రమాదాన్ని ఎదిరించి, ఓడించడమే నేటి కార్మికుల కర్తవ్యం.
ఇది జరగాలంటే కార్మికులు కోట్లల్లో కదలాలి. అది జరగా లంటే కార్మికులు కార్మిక సంఘాలను తమ స్వంత ఇళ్ళుగా పరిగణి స్తున్నారా? అవి నాయకుల దుర్గాలుగానే ఉన్నాయా? సాధారణ కార్మికులను నిర్ణయాల్లో భాగస్వాములు చేస్తేనే ఇది సాధ్యం. సీఐటీయూ ఆవిర్భావం నుంచి నాయకత్వం ఈ విషయంలో హెచ్చరిస్తూనే ఉంది. మన రాష్ట్రంలో మచ్చుకో ఉదాహరణ. సీఐటీయూ రాష్ట్ర భవన నిర్మాణంలో అసంఘటిత కార్మికుల నుంచి భారీ పరిశ్రమల కార్మికుల వరకు చలిచీమలు పుట్ట పెట్టుకున్న చందాన భారీ మొత్తంలో నిధి ఇవ్వడం, చివరికి మూసేసిన కంపెనీ కార్మికులు సైతం తమ వంతు భాగం ఇవ్వడం ఆ సంఘం వారికి తల్లో నాలుకలాగా ఉందని అర్థమవుతుంది. బీటీఆర్‌ చెప్పినట్టు ”మనమేమిటో మనకు మనమే తెలియజేసుకునే సందర్భమిది”.
శత్రువు గురించి భ్రమల్లేని స్పష్టత, లక్ష్యశుద్ధి ఆ సంఘాన్ని ప్రస్తుత దశకు చేర్చాయి. ఎప్పటికప్పుడు తన బలహీనతలను లోపాలను నిష్కర్షగా ఆత్మవిమర్శ చేసుకుంటూ పురోగమించే సంఘానికి ఎక్కడా మజిలీల్లేవు. దానిది ప్రస్థానమే!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -