బెంగళూరు : ప్రధాని మోడీ కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి ఆదివారం మెట్రో రైడ్ చేశారు. రాజకీయంగా ఎప్పుడూ కర్నాటక సర్కారుపై విమర్శలు చేసే ప్రధాని..
ఆ రాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంలతో అప్యాయంగా మాట్లాడుతూ కనిపించారు. బెంగళూరులో జరిగిన నూతన మెట్రో లైన్ ప్రారంభోత్సవంలో ఈ అరుదైన దృశ్యం కనిపించింది. ఆదివారం బెంగళూరులో ఎల్లో మెట్రోలైన్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్వీ రోడ్ మెట్రోస్టేషన్లో ప్రధానికి స్వాగతం పలికిన సీఎం సిద్ధరామయ్య.. పుష్పగుచ్ఛం అందిస్తూ ఆయన చేతిని పట్టుకుని ఆప్యాయంగా పలకరించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రాజెక్టు వివరాలను ప్రధానికి ఎంతో ఉత్సాహంగా వివరించారు. కార్యక్రమం పూర్తయ్యాక ముగ్గురు నేతలు కలిసి కొత్త మెట్రో రైలులో ప్రయాణించారు.ఆర్వీ రోడ్ స్టేషన్ నుంచి బొమ్మనహళ్లి వరకు సాగిన 19.15 కిలోమీటర్ల ప్రయాణంలో ప్రధాని మోడీకి ఇరువైపులా సిద్ధరామయ్య, శివకుమార్లు కూర్చున్నారు. ప్రయాణమంతా ముగ్గురూ సరదాగా ముచ్చటించుకున్నారు. రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి ఆ ముగ్గురు ఇలా కలిసిపోయి ముచ్చటించుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
కార్యక్రమానికి ముందు ప్రధాని మోడీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి టికెట్ కొనుగోలు చేశారు. అనంతరం ఎల్లో లైన్ మెట్రో సేవలకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ మార్గం బెంగళూరు సెంట్రల్ డిస్ట్రిక్ట్ను టెక్ హబ్ అయిన ఎలక్ట్రానిక్స్ సిటీతో కలుపుతుంది. ప్రధానితోపాటు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 16 మంది విద్యార్థినిలు, 8 మంది చిన్నారులు, 8 మంది మెట్రో కార్మికులకు ఈ రైలులో ప్రయాణించే అవకాశం దక్కింది. వారితో కూడా ప్రధాని ముచ్చటించారు.
ఆపరేషన్ సిందూర్ విజయం వెనుక.. దేశీయ సాంకేతికత, మేక్ ఇన్ ఇండియా : ప్రధాని మోడీ
‘ఆపరేషన్ సిందూర్’ విజయం వెనుక భారతీయ సాంకేతికత, మేక్ ఇన్ ఇండియా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దేశీయ టెక్నాలజీ, మేక్ ఇన్ ఇండియా కొన్ని గంటల్లో పాకిస్తాన్ను మోకరిల్లేలా చేశాయన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా ప్రపంచం మొదటిసారిగా భారతదేశం తాలుకా కొత్త ముఖాన్ని చూసిందని, పాక్లోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడంలో దాని సామర్థ్యాన్ని ప్రదర్శించిందని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ బెంగళూరులో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్నాటక సీఎం, డిప్యూటీ సీఎంతో ప్రధాని మెట్రో రైడ్
- Advertisement -
- Advertisement -