తరగతుల బంద్ పాటిస్తాం
ఫీజు బకాయిలు రూ.వెయ్యి కోట్లు 12 నాటికి విడుదల చేయాలి
రాష్ట్ర ప్రభుత్వానికి యాజమాన్యాల డెడ్లైన్
రూ.200 కోట్లే ఇవ్వడంతో దసరా చేసుకోలేని పరిస్థితి
సీఎం రేవంత్రెడ్డి వీలును బట్టి 18లోపు సమావేశం :ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య చైర్మెన్ రమేష్బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.పది వేల కోట్లున్నాయి. వాటిలో టోకెన్లు ఇచ్చిన నిధులు రూ.1,200 కోట్ల వరకు ఉన్నాయి. దసరా నాటికి రూ.600 కోట్లు, మిగిలిన రూ.600 కోట్లు దీపావళి నాటికి ఇస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. బుధవారం రూ.200 కోట్లు మాత్రమే కాలేజీ యాజామాన్యాలకు ప్రభుత్వం విడుదల చేసింది. దసరాకు ఇస్తామన్న రూ.400 కోట్లు, దీపావళి నాటికి ఇస్తామన్న రూ.600 కోట్లు కలిపి రూ.వెయ్యి కోట్లు ఈనెల 12వ తేదీ నాటికి విడుదల చేయాలి. లేదంటే ఈనెల 13 నుంచి రాష్ట్రంలోని ప్రయి వేటు ఇంజినీరింగ్, వృత్తి విద్యా కాలేజీలు నిరవధిక సమ్మె చేపడతాం. తరగతుల బంద్ పాటిస్తాం’అని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య (ఫాతి) చైర్మెన్ నిమ్మటూరి రమేష్బాబు ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం దసరా నాటికి రూ.600 కోట్లు విడుదల చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు అత్యవసర సమావేశాన్ని బుధవారం నిర్వహించాయి.
అనంతరం ఫాతి చైర్మెన్ నిమ్మటూరి రమేష్బాబు, సెక్రెటరీ జనరల్ రవికుమార్ మీడియాతో మాట్లాడు తూ రూ.200 కోట్లే విడుదల చేసినందుకు బాధ ఉన్నా ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. మిగిలిన రూ.వెయ్యి కోట్లు ఎప్పుడిస్తారో, ఎలా చెల్లిస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల 13 నుంచి 18 వరకు ఫాతి ఆధ్వర్యంలో వారంరోజులపాటు నిరసన, సత్యాగ్రహ దీక్షలను చేపడతామని వివరించారు. అవసరమైతే చలో హైదరాబాద్, రాస్తారోకోలు నిర్వహి స్తామన్నారు. ఒక్కో జిల్లాలో ఒక్కో రూపంలో విద్యార్థు లు, తల్లిదండ్రులతో కలిసి నిరసన కార్యక్రమాలుం టాయని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి విద్యాశాఖ బాధ్యతలను నిర్వహిస్తున్నందున ఇక నుంచి తమ చర్చలన్నీ సీఎం కార్యాలయంతోనే ఉంటాయని స్పష్టం చేశారు. ఈనెల 13 నుంచి 18లోపు ముఖ్యమంత్రి వీలును బట్టి సమావేశాన్ని నిర్వ హిస్తామనీ, రాష్ట్రంలోని 2,500 కాలేజీ యాజమాన్యాలు హాజరవు తాయని వివరించారు. 2023-24 విద్యా సంవత్సరం బకాయిల్లో 50 శాతం విడుదల చేశా మంటూ ప్రభుత్వం చెప్తోందన్నారు.
కానీ 2021-22, 2022-23 విద్యా సంవత్సరాల్లో ఉన్న బకాయిల టోకెన్లను రద్దు చేసిందని అన్నారు. ఆ టోకెన్లకు సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత విద్యాసంవత్సరంతో కలిపితే రాష్ట్రంలో రూ.పది వేల కోట్ల వరకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. ఇందులో బీఆర్ఎస్ హయాంలో రూ.4,500 కోట్లు, కాంగ్రెస్ వచ్చాక రూ.5,500 కోట్ల బకాయిలున్నాయని వివరించారు. విద్యార్థుల భవిష్యతు, యాజమాన్యాల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం టోకెన్ల సొమ్ము విడుదల చేయకపోవడంతో దసరా పండుగ నిర్వహించుకోలేని పరిస్థితిలో ఉన్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫాతి కోశాధికారి కొడాలి కృష్ణారావు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కె సునీల్కుమార్, ప్రతినిధులు రేపాక ప్రదీప్రెడ్డి, జైపాల్రెడ్డి, గుర్రం నాగయ్య చౌదరి, కె రామదాస్, అల్జాపూర్ శ్రీనివాస్, సూర్య నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.