Thursday, January 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమార్చి 22న నిమ్స్‌లో ప్రొఫెసర్‌ కాకర్ల జాతీయ సదస్సు

మార్చి 22న నిమ్స్‌లో ప్రొఫెసర్‌ కాకర్ల జాతీయ సదస్సు

- Advertisement -

బోచర్‌ విడుదల చేసిన డాక్టర్‌ నగరి బీరప్ప
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్‌), సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ రేడియోగ్రాఫర్స్‌ తెలంగాణ చాప్టర్‌ సంయుక్తాధ్వర్యంలో మార్చి 22న నిమ్స్‌లో ప్రొఫెసర్‌ కాకర్ల సుబ్బారావు జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రిలో సదస్సు బ్రోచర్‌ను నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నగరి బీరప్ప విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమ్స్‌ రేడియాలజీ విభాగం దేశంలోనే ఆధునిక యంత్ర పరికరాలతో అగ్రగామిగా ఉందని తెలిపారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సాంకేతిక నిపుణులకు అందించడంలో జాతీయ స్థాయి సదస్సులు ఎంతో దోహదం చేస్తాయని చెప్పారు. నిమ్స్‌ రేడియాలజీ సాంకేతిక నిపుణులు జాతీయ స్థాయిలో రాణించడం సంస్థకు గర్వకారణమనీ, ఇటీవల జాతీయ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా నియమితులైన శ్రీనివాస్‌ ఇందుకు ఉత్తమ ఉదాహరణ అని అభినందించారు.. సదస్సులో రేడియాలజీ ఇమేజింగ్‌ సాంకేతిక విద్యార్థులు సమర్పించే ఉత్తమ పరిశోధన పత్రానికి ప్రొఫెసర్‌ కాకర్ల సుబ్బారావు ఉత్తమ పరిశోధక పత్రం అవార్డు ప్రదానం చేయనున్నట్టు ప్రకటించారు. ఈ అవార్డు కింద నగదు బహుమతి, ప్రశంసా పత్రం అందజేస్తామన్నారు. రేడియాలజీ సాంకేతిక, సేవల విభాగంలో ఉత్తమ సేవలు అందించిన ప్రముఖ రేడియోగ్రఫీ సాంకేతిక నిపుణులకు ప్రొఫెసర్‌ కాకర్ల సుబ్బారావు లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును ప్రతి సంవత్సరం ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది ప్రొఫెసర్‌ కాకర్ల శత జయంతి అవార్డు -2025ను నిమ్స్‌ వైద్య అనుబంధ వత్తి విజ్ఞాన కళాశాల ప్రిన్సిపాల్‌,మెడికల్‌ రేడియాలజీ ఇమేజింగ్‌ అండ్‌ థెరప్యూటిక్‌ టెక్నాలజీ ప్రొఫెషనల్స్‌ జాతీయ కౌన్సిల్‌ అధ్యక్షుడైన శిరందాస్‌ శ్రీనివాస్‌కు ప్రదానం చేయనున్నట్టు సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ రేడియోగ్రాఫర్స్‌ అకడమిక్‌ డైరెక్టర్‌, జ్యూరీ సభ్యులు దామోదర నాయుడు ప్రకటించారు. ఈ కార్యక్రమం గత 13 సంవత్సరాలుగా నిరంతరంగా నిర్వహించబడుతోందని తెలిపారు.
సదస్సులో దేశ నలుమూలల నుంచి రేడియాలజిస్టులు, సాంకేతిక నిపుణులు, రేడియాలజీ ఇమేజింగ్‌ విద్యార్థులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి నిమ్స్‌ రేడియో డయాగ్నోసిస్‌ విభాగం సీనియర్‌ ప్రొఫెసర్‌, హెడ్‌ డాక్టర్‌ రామ్మూర్తి ఎస్‌ చీఫ్‌ పాట్రన్‌గా, కాకర్ల సుబ్బారావు రీసెర్చ్‌ ఎడ్యుకేషన్‌ సైన్సెస్‌ ట్రస్ట్‌ (కెఆర్‌ఇఎస్టీ) సభ్యులు డాక్టర్‌ ఎన్‌. కవిత రెడ్డి పాట్రన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ గంగాధర్‌, డాక్టర్‌ పరంజ్యోతి, డాక్టర్‌ రాహుల్‌ దేవరాజు పాల్గొన్నారు. సదస్సులో పాల్గొనే ఆసక్తి కలిగిన విద్యార్థులు, రేడియాలజిస్టులు ఫిబ్రవరి 10లోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని నిర్వాహకులు సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ రేడియోగ్రాఫర్స్‌ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.ఏ.వారిస్‌, నేషనల్‌ సీఎంఈ – 2026, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌ మహేష్‌ బసవేని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -