సీఈఓలుగా ప్రమోషన్లు పొందిన 27 మంది డిప్యూటీ సీఈఓలు
డిప్యూటీ సీఈఓలుగా 55 మంది ఎంపీడీఓలు
ప్రజాభవన్లో మంత్రి సీతక్కను సన్మానించిన అధికారులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో డిప్యూటీ సీఈఓలు, ఎంపీడీఓలకు ఉద్యోగోన్నతులు లభించాయి. సుదీర్ఘకాలంగా ప్రమోషన్ల ఫైల్ పెండింగ్లో ఉండగా…మంత్రి సీతక్క చొరవతో ప్రజా ప్రభుత్వం దాన్ని క్లియర్ చేసింది. దీంతో సీఈఓలుగా 27 మంది డిప్యూటీ సీఈఓలు, 55 మంది ఎంపీడీఓలు డిప్యూటీ సీఈఓలుగా ప్రమోషన్లు పొందారు. దీంతో వారంతా ప్రజా భవన్లో మంత్రి సీతక్కను కలిసి సన్మానించారు. సుదీర్ఘకాలం తర్వాత ప్రమోషన్లు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి స్వీట్లు తినిపించి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ…తమది ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వమని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు, అర్హత కలిగిన వారికి సమయానుకూలంగా పదోన్నతులు కల్పించడం తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.
శాఖ బలోపేతం కావడం ద్వారా ప్రజలకు మరింత చేరువగా, సమర్థవంతమైన సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ఖాళీగా ఉన్న 28 ఎంపీడీఓ పోస్టుల నుంచి డిప్యూటీ సీఈఓలుగా, 15 మంది డిప్యూటీ సీఈఓల నుంచి సీఈఓలుగా పదోన్నతులు కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని మంత్రి హామీ ఇచ్చారు. ఎంపీడీవోల నుంచి అటెండర్ల వరకు ఖాళీగా ఉన్న అన్ని పోస్టుల్లో దశలవారీగా పదోన్నతులు కల్పిస్తామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో టీజీవో అధ్యక్షులు ఏలూరు శ్రీనివాస్రావు, సీఈఓ, డిప్యూటీ సీఈఓ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కొంపల్లి నర్సింహులు, ఎంపీడీఓ అసోసియేషన్ ప్రతినిధులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగోన్నతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



