Friday, June 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపురాతన కట్టడాలను కాపాడుకోవాలి

పురాతన కట్టడాలను కాపాడుకోవాలి

- Advertisement -

– 35 మందితో స్వీప్ట్‌ ఉమెన్‌ యాక్షన్‌ టీమ్‌లు సిద్ధం :హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌, డీజీ సీవీ ఆనంద్‌
– హార్స్‌ గ్రౌండ్‌ ప్రాంతం పరిశీలన
నవతెలంగాణ-సిటీబ్యూరో/బేగంపేట్‌

హైదరాబాద్‌ నగరంలో ఉన్న పురాతనమైన (చారిత్రక ప్రాముఖ్యత కలిగిన) కట్టడాలను భావితరాల కోసం కాపాడుకోవాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌, డీజీ సీవీ ఆనంద్‌ అన్నారు. గోషామహల్‌ పోలీస్‌ గ్రౌండ్‌ను సీపీ మంగళవారం సందర్శించారు. అక్కడ ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనం నిర్మించనున్నందున పోలీస్‌ హార్స్‌ గ్రౌండ్‌ కోసం చక్నావాడి దగ్గరలో షెడ్డు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక హార్స్‌ గ్రౌండ్‌ ప్రాంతాన్ని సీపీ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌కు సంబంధించిన పురాణి హవేలీలోని పాత కమిషనర్‌ కార్యాలయానికి మరమ్మతు పనులు జరుగుతున్నాయని, త్వరలో ప్రారంభించాక ప్రతి శుక్రవారం అక్కడి నుండే విధులు నిర్వహిస్తానని చెప్పారు. ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నందున పోలీస్‌ శాఖకు చెందిన బ్లాక్స్‌ను తరలిస్తున్నామని తెలిపారు. చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న హార్స్‌ గ్రౌండ్‌ను తాత్కాలికంగా తరలించినట్టు తెలిపారు. తమ శాఖకు చెందిన అన్ని విభాగాలనూ తరలించి వైద్య శాఖకు అప్పగించామన్నారు. పోలీస్‌ శాఖకు ఇక్కడే 11 ఎకరాలు కేటాయించారని తెలిపారు. 11 ఎకరాల్లో తమ 7 జోన్లకు చెందిన పలు కాంప్లెక్స్‌లు నిర్మిస్తామని చెప్పారు. టీటీఐ పక్కన మరో 2 ఎకరాలు కేటాయించినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.55 కోట్లు కేటాయించారన్నారు. పోలీస్‌ కార్పొరేషన్‌ ద్వారా నిర్మాణాలు జరుగుతాయన్నారు. తాత్కాలికంగా హార్స్‌ టేబుల్‌, డాగ్‌ కెనల్‌ను నిర్మించినట్టు వెల్లడించారు. పోలీసు శాఖకు చెందిన భవనాల పనులను ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. అనంతరం మహిళా పోలీసులకు సెల్ఫ్‌ డిఫెన్స్‌పై ట్రైనింగ్‌ను పరిశీలించారు. స్వీప్ట్‌ ఉమెన్‌ యాక్షన్‌ టీంలు మహిళలను ప్రొటెక్ట్‌ చేసినప్పుడు.. వారిని సురక్షితంగా తరలించడానికి ఈ టీమ్‌లు పనిచేస్తాయన్నారు. 35 మందితో మొదటి స్వీప్ట్‌ ఉమెన్‌ యాక్షన్‌ టీమ్‌ సిద్ధం చేశామని సీపీ వివరించారు.
ఈ భవనంలోనే ఎన్నో కార్యక్రమాలు
సికింద్రాబాద్‌లోని రామ్‌గోపాల్‌పేట పోలీస్‌ స్టేషన్‌ భవనాన్ని కూడా సీపీ సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీఏ) ఈ భవనానికి మరమ్మతులు చేసి హైదరాబాద్‌ సిటీ పోలీసులకు తిరిగి అప్పగించిందని తెలిపారు. ఈ జేమ్స్‌ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌ భవనం 1900లో నిర్మించారని, ఇది 2016 వరకు(116 సంవత్సరాల) సుదీర్ఘ కాలంగా రామ్‌గోపాల్‌పేట పోలీస్‌ స్టేషన్‌గా సేవలందించిందని అన్నారు. తొమ్మిదేండ్ల కిందట ఈ పోలీస్‌ స్టేషన్‌ను మినిస్టర్‌ రోడ్‌లోని అద్దె భవనంలోకి మార్చామన్నారు. గతంలో తాను సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా పనిచేసినప్పుడు ఈ భవనంలోనే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని, భవనానికి చాలా ప్రత్యేకత ఉందని వివరించారు. కొద్ది రోజుల్లో రామ్‌గోపాల్‌పేట పోలీస్‌ స్టేషన్‌కు సంబంధించిన వస్తువులను తిరిగి ఈ భవనంలోకి తరలించి, హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయిస్తామని కమిషనర్‌ తెలిపారు. ప్రస్తుతం పోలీస్‌ స్టేషన్‌కు సంబంధించిన వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగిందని, వాటి పార్కింగ్‌ సదుపాయం కోసం ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ఎస్‌.రష్మి పెరుమాల్‌, ట్రాఫిక్‌ డీసీపీ రాహుల్‌ హెడ్గేతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -