Wednesday, April 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవయోవృద్ధుల ఆరోగ్య పరిరక్షణ సమాజానికి అత్యంత ముఖ్యం

వయోవృద్ధుల ఆరోగ్య పరిరక్షణ సమాజానికి అత్యంత ముఖ్యం

- Advertisement -

– నిమ్స్‌ డైరెక్టర్‌, ప్రొఫెసర్‌ డాక్టర్‌ నగరి బీరప్ప
– నిమ్స్‌లో వయోవృద్ధుల ఉచిత సమగ్ర ఆరోగ్య పరీక్షల శిబిరం విజయవంతం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

వయోవృద్ధుల ఆరోగ్య పరిరక్షణ సమాజానికి అత్యంత ముఖ్యమని నిమ్స్‌ డైరెక్టర్‌, ప్రొఫెసర్‌ డాక్టర్‌ నగరి బీరప్ప అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో హెల్త్‌మిషన్‌-100లో భాగంగా వయోవృద్ధులకు ఉచిత సమగ్ర ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని నగరి బీరప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ తరహా ఉచిత సమగ్ర ఆరోగ్య శిబిరాలు వృద్ధుల్లో వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి, సరైన చికిత్స అందించడానికి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా నిమ్స్‌ ఆస్పత్రి ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. నిమ్స్‌ జెరియాట్రిక్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ వై.సత్యనారాయణ రాజు మాట్లాడుతూ.. వయోవృద్ధులలో సాధారణంగా కనిపించే వ్యాధులను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యమన్నారు. ఈ శిబిరం ద్వారా వారికి అవసరమైన ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు, సలహాలు ఒకే వేదికపై అందించామని తెలిపారు. వృద్ధుల ఆరోగ్య సంరక్షణలో నియమిత పరీక్షలు, సరైన ఆహారం, జీవన శైలి మార్పులు కీలకమని ఆయన సూచించారు. ఇలాంటి శిబిరాలు ఆరోగ్యంపై అవగాహన పెంచడంతో పాటు, మంచి జీవన ప్రమాణాలను సాధించేందుకు దోహదపడతాయన్నారు. మొత్తం వంద మంది వయోవృద్ధులు ఈ శిబిరంలో నమోదు చేసుకోగా..వారికి సీబీపీ, ఆర్‌బీఎస్‌, సీరమ్‌ క్రియాటిన్‌, ఈసీజీ, కంటి, తదితర పరీక్షలను నిర్వహించారు. అవసరమైన వారికి ఫిజియోథెరపీ సేవలు, ప్రొఫెషనల్‌ కౌన్సెలింగ్‌ను ఉచితంగా అందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -