హైదరాబాద్ నగర ప్రజలకు హైడ్రా విజ్ఞప్తి
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా చెరువులు.. నాలాలు కబ్జాకు గురైతే సమాచారమివ్వాలని హైడ్రా ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. నగరంలో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు హైడ్రా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో మొదటి విడతగా నగరంలోని ఆరు చెరువులను పునరుద్ధరిస్తోంది. నగరానికి వరద ముప్పు తప్పించాలంటే గొలుసుకట్టు చెరువులు కీలక పాత్ర పోషిస్తాయి. వర్షం పడితే వరద నీరు రహదారులు, నివాస ప్రాంతాలను ముంచెత్తకుండా.. నేరుగా చెరువుల్లోకి చేరేలా హైడ్రా చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రతువులో నగర ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతోంది. మీ పరిధిలో చెరువులు, నాలాలు కబ్జాకు గురవుతుంటే ఆ సమాచారాన్ని హైడ్రా వాట్సాప్ నంబరు 8712406899కు పంపాలని విజ్ఞప్తి చేసింది. ఫొటోలతో పాటు.. ప్రాంతాలను తెలియజేసే లొకేషన్ను షేర్ చేయాలని పేర్కొంది. కమిషనర్ హైడ్రా పేరిట ఉండే ట్విట్టర్(ఎక్స్), ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్లకు కూడా సమాచారం అందజేయాలని కోరింది.
సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే సియట్ లే ఔట్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శేరిలింగంపల్లి, కూకట్పల్లి మండలాల సరిహద్దులోని గుట్టల బేగంపేట, అల్లాపూర్ గ్రామాల మధ్య ఉన్న సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే సియెట్(ఎస్ఐఇటి) లే ఔట్ వస్తోందని హైడ్రా స్పష్టం చేసింది. ఆ లే ఔట్కు సంబంధించి గతంలో హెచ్ఎండీఏ ఇచ్చిన డ్రాఫ్ట్ లే ఔట్ను కూడా ఇదే కారణంగా రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేసింది. ఇక్కడే గతంలో ఇంటి నిర్మాణానికి అనుమతిచ్చిన జీహెచ్ఎంసీ కూడా ఆ అనుమతులను రద్దు చేసుకుందని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో తమకు న్యాయం చేయాలంటూ సియెట్ లేఔట్ ప్లాట్ల యజమానులు సోమవారం ఆందోళన చేయడంలో అర్థం లేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సున్నం చెరువు 32.60 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 1975లో సర్వే ఆఫ్ ఇండియా లెక్కలు ఇదే స్పష్టం చేస్తున్నాయి. గామ రికార్డుల్లో కూడా ఇదే విషయం స్పష్టమౌతోంది. అయినప్పటికీ హైకోర్టు ఆదేశాల మేరకు ఇరిగేషన్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ విభాగాలతో కలిసి హైడ్రా సర్వే కూడా చేయించింది. అన్ని కోణాల్లో పరిశీలించాక.. సర్వే ఆఫ్ ఇండియా రికార్డుల్లో ఉన్న లెక్కలే తేలాయి. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో, నాలాలను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను ఉపేక్షించొద్దని.. వెంటనే వాటిని తొలగించాలని కోర్టులు ఎప్పట ికప్పుడూ స్పష్టం చేస్తున్న విషయాన్ని హైడ్రా గుర్తు చేస్తోంది. ప్రస్తుతం ఆ లే ఔట్లో ఎలాంటి నిర్మాణా లూ జరగలేదని పేర్కొంది. ఖాళీగా ఉన్న ప్లాట్లకు సంబంధించి అర్హులమని భావిస్తే నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలని హైడ్రా సూచించింది. చెరువు పునరుద్ధరణ పనులకు ఆటంకం కలిగించొద్దని హైడ్రా విజ్ఞప్తి చేసింది.