నవతెలంగాణ-గండీడ్
అనారోగ్యంతో అకాల మరణం పొందిన చిరకాల స్నేహితుని కుటుంబానికి అండగా మేమున్నామంటూ ముందుకువచ్చి మైత్రి అన్న మాటకు సరైన నిర్వచనాన్ని అందించారు పూర్వ విద్యార్థి మిత్రులు. మండల కేంద్రానికి చెందిన మోర కేశవులు సోమవారం అనారోగ్యంతో అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న 2004-2005 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి బ్యాచ్ మిత్రులు తమవంతుగా మిత్రుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించారు.
మోర కేశవులు భౌతికకాయానికి నివాళులర్పించి, రూ.20,000 నగదును మృతుని భార్యకు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈసందర్భంగా పలువురు స్నేహితులు మాట్లాడుతూ…ఈ లోకంలో స్నేహానికి మించిన బంధం మరొకటి లేదని అందరితో మమేకమై కలివిడిగా కష్టసుఖాలను పాలుపంచుకునే ఆప్త మిత్రుడు దూరమవ్వడం చాలా బాధాకరమన్నారు.భౌతికంగా మా మధ్య లేకపోయినా అతని భావాలు మాపై చూపించిన ఆధారాభిమానాలు ఏనాటికి చెరగని స్మృతులుగా మా మధ్య మెదలాడుతూనే ఉంటాయన్నారు. మిత్రుడు కేశవులు కుటుంబానికి ఎల్లవేళలా తమవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.



